సిటీబ్యూరో, జూన్ 10 (నమస్తే తెలంగాణ): అక్రమంగా ఇతర రాష్ర్టాలకు చెందిన నాన్ డ్యూటీ పెయిడ్ మద్యం విక్రయిస్తున్న నిందితుడిని సికింద్రాబాద్ డీటీఎఫ్ పోలీసులు అరెస్టు చేశారు. సికింద్రాబాద్ డీటీఎఫ్ సీఐ సావిత్రి సౌజన్య కథనం ప్రకారం… సికింద్రాబాద్లోని బగర బార్ అండ్ రెస్టారెంట్ పరిసర ప్రాంతాల్లో జోరుగా ఇతర రాష్ర్టాలకు చెందిన నాన్డ్యూటీ పెయిడ్, డిఫెన్స్ మద్యం విక్రయాలు జరుగుతున్నట్లు అందిన సమాచారం మేరకు డీటీఎఫ్ బృందం స్థానికంగా రూట్వాచ్ నిర్వహించి, వాహనాలు తనిఖీ చేశారు.
సనత్నగర్కు చెందిన నిఫా ధార ప్రయాణిస్తున్న కారును ఆపి తనిఖీ చేయగా హరియాణ, ఢిల్లీ, గోవా, వెస్ట్ బెంగాల్, కర్నాటక తదితర రాష్ర్టాలకు చెందిన మద్యం బాటిళ్లు లభించాయి. గత కొంత కాలంగా నిందితుడు ఇతర రాష్ర్టాల నుంచి తక్కువ ధరకు మద్యం కొనుగోలు చేసి, నగరంలో అధిక ధరలకు విక్రయిస్తూ సర్కార్ ఖజానాకు గండి కొడుతున్నట్లు తేలింది. నిందితుడిని అరెస్టు చేసి, రూ.3లక్షల విలువ చేసే 85 ఎన్డీపీఎస్ మద్యం బాటిళ్లు,కారును స్వాధీనం చేసుకున్నారు. సికింద్రాబాద్ ఈఎస్ పంచాక్షరి పర్యవేక్షణలో ఈ దాడులు జరిగాయి.