సిటీబ్యూరో, జూలై 28 (నమస్తే తెలంగాణ): వచ్చే నెల 9న జరిగే మొహర్రం ఊరేగింపు ప్రశాంతంగా సాగిపోయేలా చూడాలని నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. సాలార్ జంగ్ మ్యూజియంలో జరిగిన సమన్వయ సమావేశంలో నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ గురువారం షియా కమ్యూనిటీ సభ్యులతో నిర్వహించిన సమావేశంలో భద్రత, ట్రాఫిక్, ఇతర ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించి, సభ్యుల అభిప్రాయాలను సేకరించారు.
ఈ సందర్భంగా సీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. డబీర్పురలోని బీబీ కా అలవా నుంచి ఆలం ఊరేగింపునకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. సమావేశంలో అదనపు సీపీలు చౌహాన్, ఎమ్మెల్యే అహ్మద్ పాషా ఖాద్రీ, ఎమ్మెల్సీ సయ్యద్ రియాజ్ ఉల్ హసన్, కార్పొరేటర్లు, మౌలానాలు, జీహెచ్ఎంసీ అధికారులు పాల్గొన్నారు.