సికింద్రాబాద్, నవంబర్ 3: కంటోన్మెంట్ బోర్డు సీఈఓ అజిత్రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు, అధికారులు చేస్తున్న పనులకు పొంతన లేకుండా పోతున్నాయి. నిర్ణయాలు తొలుతగా తీసుకోవడం ఆ తరువాత వాటిని సమీక్షించుకోవడం పరిపాటిగా మారుతుంది. దీంతో పాటు ఒంటెద్దు పోకడలతో రాజ్యంగబద్ధ్దంగా నడుస్తున్న బోర్డు మసకబారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. బుధవారం బోర్డు కార్యాలయంలో 2021 ప్రత్యేక ఓటర్ల జాబితా రూపకల్పనపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో డిప్యూటీ సీఈఓ విజయ్కుమార్ బాలన్ నాయర్ నేతృత్వంలో అధికారులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్రంలో అధికారంలో కొనసాగుతున్న టీఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులను పిలువకపోవడం గమనార్హం. ఇదంతా సీఈఓ కనుసన్నల్లోనే జరిగినట్లు తెలుస్తోంది.
కంటోన్మెంట్ బోర్డులో ఎన్నికల అధికారి చలామణి అవుతున్న ఓ అధికారి ఒకవేళ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న తీరు ఇప్పటికే చర్చనీయాంశం అవుతుండగా, దీనంతటికీ ముఖ్య అధికారిగా ఉన్న సీఈఓ తనకేమీ తెలియనట్లు వ్యవహరిస్తుండటం ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది. కంటోన్మెంట్ ప్రాంతంలో ఎమ్మెల్యేగా ఉన్న సాయన్నకు గాని బోర్డు మాజీ ఉపాధ్యక్షుడిగా ఉన్న జక్కుల మహేశ్వర్రెడ్డితో పాటు ఇతర మాజీ సభ్యులుగా ఉన్న టీఆర్ఎస్ పార్టీకి కనీసం సమాచారం ఇవ్వకుండానే కేవలం ఇతర పార్టీల ప్రజాప్రతినిధులు, బోర్డు అధికారులకు మెచ్చిన నేతలతోనే సమావేశాన్ని నిర్వహించడంపై సీఈఓ ఎలాంటి వివరణ ఇస్తారో వేచిచూడాల్సిందే.
ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు
సీఈఓ అజిత్రెడ్డి వ్యవహరిస్తున్న తీరుపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు టీఆర్ఎస్ పార్టీ సన్నద్ధం అవుతున్నట్లు సమాచారం. ఓటర్ల జాబితా అప్పటికే తప్పులతడకగా మారగా, ఆల్ పార్టీ మీటింగ్కు టీఆర్ఎస్ను ఆహ్వానిస్తే బండారం బయటపడుతుందనే ఉద్దేశంతోనే సమావేశానికి పిలవనట్లు తెలుస్తోంది. బోర్డు మాజీ సభ్యులను సమావేశానికి పిలిస్తే అధికారులు పాల్పడుతున్న అవకతవకలు బయటకు వస్తాయనే నెపంతోనే టీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులను మీటింగ్ సమాచారం ఇవ్వలేదనే అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని టీఆర్ఎస్ నేతలు పేర్కొంటున్నారు.