కొడంగల్, ఫిబ్రవరి 2 : దేశంలోనే హైదరాబాద్ బేగంపేట కళాశాలకు న్యాక్ గుర్తింపులో ద్వితీయ స్థానం లభించిందని ఉన్నత విద్యా జాయింట్ డైరెక్టర్ డాక్టర్ డీఎస్ఆర్ రాజేందర్సింగ్ తెలిపారు. గురువారం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలను న్యాక్ బృందం కళాశాలను సందర్శించి మౌలిక వసతులు, విద్యార్థుల విద్యా నాణ్యతలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఉన్నత విద్యా జాయింట్ డైరెక్టర్ కొడంగల్ డిగ్రీ కళాశాలకు విచ్చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మొత్తం 132 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల ఉన్నాయని, అందులో 11 కాలేజీలు స్వయం ప్రతిపత్తి కలిగి ఉన్నాయన్నారు.
అయితే ఇప్పటి వరకు 88 కళాశాలలకు న్యాక్ గుర్తింపు లభించిందని, అందులో 88వ స్థానం కొడంగల్ డిగ్రీ కళాశాలకు దక్కిందన్నారు. న్యాక్ బృందం కళాశాలను పరిశీలించి గ్రేడింగ్ అందిస్తుందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఏ గ్రేడ్ రూ.5కోట్లు, బీ గ్రేడ్కు రూ. 3కోట్లు అదనంగా నిధులు మంజూరు అయ్యే అవకాశం ఉన్నదన్నారు. ప్రస్తుతం డిగ్రీ కళాశాలల్లో 50 రకాల కాంబినేషన్ కోర్సులను ప్రవేశపెట్టామని, ఎర్నింగ్ బై లర్నింగ్ ప్రాతిపదికన రాష్ట్రంలో హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్లలోని నాలుగు కళాశాలల్లో వినూత్న విద్యను ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టామని వివరించారు.
52 కంపెనీలతో సంప్రదింపులు జరిపామని, ఈ కాలేజీల్లో చదివే విద్యార్థులు మూడు రోజులు కళాశాలలో చదువు, మరో మూడు రోజులు కంపెనీలో డ్యూటీ చేయాల్సి ఉంటుందన్నారు. హైదరాబాద్ సిటీ కాలేజీలో ఎమ్మెస్సీ స్టాటిస్టిక్స్ కోర్సును ప్రవేశపెట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాక్ బృందంతో పాటు కళాశాల ప్రిన్సిపాల్ జయరాం, అధ్యాపక బృందం పాల్గొన్నారు.