Hyderabad Metro | సిటీబ్యూరో, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ): రెండో దశ మెట్రో సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) రూపకల్పనకు సవాళ్లు ఎదురవుతున్నాయి. నిత్యం ట్రాఫిక్తో నిండి ఉండే నగరంలో మెట్రో కారిడార్ల నిర్మాణం అధికారులకు ఒక పరీక్షగా మారింది. ప్రధానంగా నాగోల్ నుంచి ఎల్బీనగర్, సాగర్ రింగు రోడ్డు మీదుగా చాంద్రాయణగుట్ట, మైలార్దేవ్పల్లి నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టు లోపలి వరకు నిర్మిస్తున్న కారిడార్లో పలు చోట్ల మెట్రో పిల్లర్లతో పాటు స్టేషన్ల నిర్మాణం పెద్ద సవాలుగా మారిందని మెట్రో అధికారులు పేర్కొంటున్నారు.
ప్రస్తుతం డీపీఆర్ను రూపొందించేందుకు హైదరాబాద్ మెట్రో అధికారులతో పాటు రెండు కన్సల్టెన్సీ సంస్థలు క్షేత్ర స్థాయిలో పలు అంశాల్లో అధ్యయనం చేస్తున్నాయి. నిర్ణయించిన కారిడార్లో మెట్రో స్టేషన్ల నిర్మాణం ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండేలా నిర్మించాలంటే క్షేత్ర స్థాయిలోని పరిస్థితులు సంక్లిష్టంగా మారాయి. నగరానికి ఇన్నర్ రింగు రోడ్డుగా ఉన్న ఈ మార్గంలో అడుగడుగునా సవాళ్లు ఎదురవుతున్నాయి. పెరిగిన రద్దీకి తోడు ఇతర నిర్మాణాలు, భూగర్భంలో మంచినీరు, డ్రైనేజీ లైన్లు, విద్యుత్, టెలీ కమ్యూనికేషన్స్ వంటి మౌలిక వసతులకు సంబంధించినవి ఉన్నాయి. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొంటూ.. సమగ్రమైన ప్రాజెక్టు నివేదికను రూపొందించడం సంక్లిష్టంగా మారిందని మెట్రో అధికారులు చెబుతున్నారు.
మెట్రో రెండో దశలో అత్యంత పొడవైన కారిడార్గా ఉన్న నాగోల్-శంషాబాద్ ఎయిర్పోర్టు మార్గంలో పలు చోట్ల ఫ్లై ఓవర్లు ఉన్నాయి. నాగోల్, కామినేని, ఎల్బీనగర్, సాగర్ రింగు రోడ్డు, ఓవైసీ ఆస్పత్రి, చాంద్రాయణగుట్ట ప్రాంతాల్లో రోడ్డు మధ్యలోనే ఫై ఓవర్లు ఉన్నాయి. దీంతో మెట్రో కారిడార్ను రోడ్డు మధ్యలో కాకుండా ఒక వైపు నుంచి నిర్మించాల్సిన పరిస్థితి ఉన్నదని గుర్తించారు. ఎల్బీనగర్, సాగర్ రింగు రోడ్డు వద్ద ఫ్లై ఓవర్ల పక్క నుంచి కాకుండా అడ్డంగా ఉన్నాయి. ఇక్కడి నుంచి మెట్రో వయా డక్ట్ను వాటిపై నుంచి నిర్మించాల్సి ఉన్నది. ఈ ఫైఓవర్లు ఇప్పటికే ఎత్తు 20-25 అడుగుల ఎత్తులో ఉన్నాయి. దీంతో ఒక్కసారిగా మెట్రో పిల్లర్ల ఎత్తు, వాటిపై వయాడక్ట్లను మరింత ఎత్తులో నిర్మించాల్సి ఉంటుంది.
ఈ పరిస్థితి ఎల్బీనగర్ చౌరస్తాలో ఉంటే… 350 మీటర్ల దూరంలోనే మరో ఫ్లై ఓవర్ సాగర్ రింగు రోడ్డులో అడ్డుగా ఉంది. ఇది రెండో లెవల్ ఫ్లై ఓవర్గా ఉండటంతో మరింత ఎత్తులో మెట్రో కారిడార్ను తీసుకువెళ్లాల్సి ఉంటుంది. వీటికితోడు ఈ రెండు చౌరస్తాల్లో ప్రయాణికుల కోసం మెట్రో స్టేషన్లను నిర్మించాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడే మెట్రో అధికారులు ఒక పరీక్షగా మారింది. అత్యంత ఎత్తులో మెట్రో మార్గాన్ని నిర్మించడంతో పాటు అదే ప్రాంతంలో రెండు మెట్రో స్టేషన్లను నిర్మించాలన్న దానిపైనే అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. ఇంజినీరింగ్ పరంగా తమకు పెద్ద సవాలుగా మారిందని మెట్రో అధికారులు పేర్కొంటున్నారు.
మెట్రో రెండో దశ డీపీఆర్ను త్వరగానే పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో రెండు వేర్వేరు కన్సెల్టెన్సీలతో హైదరాబాద్ మెట్రో అధికారులు క్షేత్ర స్థాయిలో పనులు శరవేగంగా నిర్వహిస్తున్నారు. 70 కి.మీ మెట్రో మార్గంలో ఒకేసారి డీపీఆర్ రూపకల్పనకు ఆవసరమైన పనులు కన్సల్టెన్సీలు చేస్తున్నాయి. పార్లమెంటు ఎన్నికల నోటిఫికేషన్కు ముందే రెండో దశ మెట్రోకు శంకుస్థాపన చేసి, మార్చి చివరి నాటికి డీపీఆర్ సిద్ధం చేసేలా చూడాలని మెట్రో అధికారులకు సర్కారు సూచించింది. దీంతో శరవేగంగా రెండో దశకు సంబంధించిన కారిడార్లలో డీపీఆర్కు అవసరమైన అంశాలను అధ్యయనం చేస్తున్నారు. మొత్తంగా మెట్రో రెండో దశ పనులు వేగంగా సాగుతుండగా, ఇంజినీర్లకు కొన్ని సవాళ్లు ఎదురవుతున్నాయి. వాటికి సులభమైన పద్ధతులను అన్వేషించే పనిలో ఉన్నారు.
కుత్బుల్లాపూర్: పారడైస్ నుంచి బోయిన్పల్లి మీదుగా సుచిత్ర-కొంపల్లి-మేడ్చల్ వరకు మెట్రో రైలును ఏర్పాటు చేయాలంటూ.. మేడ్చల్ మెట్రో సాధన సమితి ఆధ్వర్యంలో కొన్ని రోజుల నుంచి వివిధ రూపాల్లో తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇందులోభాగంగా ఆదివారం సుచిత్ర చౌరస్తాలో జాతీయ రహదారి-44పై ఆందోళన చేపట్టారు. వీరి నిరసనకు బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్సింహారెడ్డి మద్దతు తెలిపారు.