మేడ్చల్, జూలై 31(నమస్తే తెలంగాణ): మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా జీవో 59ల దరఖాస్తుల పరిశీలన కొనసాగుతున్నది. 59 జీవోలో జిల్లాలోని మేడ్చల్, కూకట్పల్లి, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, ఉప్పల్ నియోజకవర్గాల నుంచి క్రమబద్ధీకరణకు 15,300 దరఖాస్తులు వచ్చాయి. పరిశీలనలలో ఇప్పటి వరకు 9 వేల దరఖాస్తులను పరిశీలించినట్లు మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్రెడ్డి తెలిపారు. మరో 6,300 దరఖాస్తులను మరో వారం రోజులలో పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. దరఖాస్తుల పరిశీలనకు 42 అధికార బృందాలను నియమించారు. ఇందులో జిల్లా స్థాయి అధికారులతో పాటు తహశీల్దార్లు ఉన్నారు.
పరిశీలన అనంతరం, డిమాండ్ నోటీసులు
దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసిన అనంతరం, క్రమబద్ధీకరించుకునే విధంగా డిమాండ్ నోటీసులు జారీ చేయనన్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు అర్హత ఉన్న ఇళ్లను క్రమబద్ధీకరించుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తున్నది. డిమాండ్ నోటీసుల ఆధారంగా డీడీలు చెల్లించినట్లయితే, ఇళ్లకు అధికారులు రిజిస్ట్రేషన్ చేయనున్నారు. గతంలో 59 జీవోలో 12,500 వచ్చిన దరఖాస్తులలో 3,600 మంది దరఖాస్తుదారులు ఇళ్లకు డీడీలు చెల్లించి క్రమబద్ధీకరించుకున్నట్లు అదనపు కలెక్టర్ విజయేందర్రెడ్డి తెలిపారు.