సిటీబ్యూరో, జనవరి 23 (నమస్తే తెలంగాణ): మోడలింగ్, సినిమాల్లో పిల్లలకు అవకాశం ఇప్పిస్తానంటూ నమ్మిస్తూ సైబర్ మోసాలకు పాల్పడుతున్న ముంబైకి చెందిన దంపతులను సైబరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్దనుంచి రూ. 15.6 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. సైబర్క్రైమ్స్ ఏసీపీ శ్రీధర్ కథనం ప్రకారం.. అపూర్వ అశ్విన్ దవడ అలియాస్ అర్మాన్ అర్జున్ కపూర్ అలియాస్ డాక్టర్ అమిత్ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో మార్కెటింగ్లో మాస్టర్స్ పూర్తి చేశాడు. మోడలింగ్, సినిమాలు చేయడంలో ఆసిక్త ఉండటంతో 20 ఏండ్ల కిందట అదే ఫిల్డ్లోకి వెళ్లాడు. ఈ క్రమంలోనే ఓం, చాంద్ సే రోషన్ చెహ్ర వంటి సినిమాల్లో నటించాడు. కొన్నాళ్లకు అవకాశాలు తగ్గిపోయాయి.
ఈ క్రమంలోనే పిల్లలను మోడలింగ్లోకి తీసుకుంటామంటూ నమ్మిస్తూ మోసాలు చేస్తున్న స్కామ్ ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని తెలుసుకున్నాడు. తాను కూడా అదే విధంగా పిల్లలను మోడలింగ్లోకి తీసుకెళ్తానంటూ నమ్మిస్తూ మోసాలు చేయడం ప్రారంభించాడు. ముంబై పోలీసులు గతంలో అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. ఈ అరెస్ట్ తర్వాత తన పేరును అపూర్వ అశ్విన్ దవడ నుంచి అర్జున్ కపూర్గా మార్చుకున్నాడు. నజీశ్ ఇక్బాల్ మిమన్ అలియాస్ నజీష్ అపూర్వ మెమన్ను పెండ్లి చేసుకున్నాడు. భర్త చేస్తున్న నేరాలకు ఆమె కూడా తన వంతు సహకారాన్ని అందిస్తున్నది.
ఈ క్రమంలోనే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వద్ద పిల్లల కోసం ర్యాంప్ వాక్ నిర్వహించారు. ముందుగానే ఆయా షాపింగ్ కాంప్లెక్స్లలోని దుకాణాల నిర్వాహలకు వద్ద అనుమతి తీసుకుంటాడు. కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఇన్డీడ్.కామ్లో ప్రకటనలు వేసి యువతను రప్పించుకుంటాడు. ఇలా షాపింగ్ మాల్స్లో పిల్లలకు ర్యాంప్ వాక్ ఉందంటూ తన కాస్మో పాలిటన్ మోడల్.కో.ఇన్ వెబ్సైట్లో ప్రకటనలు ఇచ్చి, స్థానికంగా ప్రచారం చేశాడు. ప్రదర్శన చూసేందుకు వచ్చేవారి ఫోన్ నంబర్లు సేకరించారు. ఆ తర్వాత వారితో మాట్లాడి మీ పిల్లలు మోడలింగ్లో సెలెక్ట్ అయ్యారు.. మీ పిల్లల ఫొటోలు పంపించండి.. తన వెబ్సైట్ను చాలా రాష్ర్టాల వారు చూస్తుంటారు.. వివిధ కంపెనీలకు సంబంధించిన 20 ప్రకటనలు చేయాల్సి ఉంది.. అందులో మోడల్స్ కావాలంటూ తల్లిదండ్రులను ఒప్పిస్తాడు. ఆ తర్వాత కొంత డబ్బు డిపాజిట్ చేయండంటూ నమ్మించి అందినంత దోచుకుంటాడు.
ఇదిలాఉండగా.. మదినాగూడకు చెందిన గోపాల కృష్ణన్ కృష్ణా నందన్ గత ఏడాది డిసెంబర్ 11న తన కూతురు పుట్టిన రోజు ఉండటంతో కొండపూర్లోని శరత్ క్యాపటట్ మాల్కు వెళ్లాడు. అక్కడ కాస్మోపాలిటన్ మోడల్ ఏజెన్సీ పిల్లలను మోడల్స్గా తీసుకోవడానికి ర్యాంప్ వాక్ నిర్వహిస్తుందన్న విషయాన్ని తెలుసుకొని ఫోన్లో సంప్రదించాడు. మీ పాప ఫొటోలు పంపించండి.. అని చెప్పి నమ్మించి తీసుకున్నారు. ఆ తర్వాత 10 రోజులకు మీ పాప ఓరియో బిస్కెట్ నేషనల్ ప్రకటనలో నటించేందుకు ఎంపికయ్యిందంటూ నమ్మిస్తూ రూ. 3.25 లక్షలు డిపాజిట్ చేయించారు.
ఆ తర్వాత వివిధ కారణాలు చెబుతూ రూ. 14.12 లక్షలు కాజేశారు. మోసపోయానని గుర్తించిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా నిందితులు మహారాష్ట్రకు చెందిన వారిగా గుర్తించి, ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి నగదుతో పాటు మొబైల్, ల్యాప్టాప్, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై సైబరాబాద్ సైబర్క్రైమ్లో 22, గచ్చిబౌలిలో ఒకటి, బాచుపల్లిలో మరొకటి, పీఎస్ సౌత్ ఈస్ట్ సెంట్రల్, బెంగళూర్లో మరొక కేసు నమోదయ్యింది. ఇన్స్పెక్టర్ ఎస్.రమేశ్ కుమార్ నేతృత్వంలోని బృందం కేసు దర్యాప్తు చేపట్టింది.