కంటోన్మెంట్, మే 7: పువ్వు పుట్టగానే పరమళిస్తుందనే చందంగా ఓ బుడ్డోడు పుట్టి ఏడాది కాకముందే క్రీడలపై ఆసక్తి పెంచుకున్నాడు. బుడ్డోడి ఆసక్తికి తోడు.. తల్లిదండ్రలు ప్రోత్సాహం తోడవడంతో.. జాతీయ స్థాయిలో పతకాలు సాధించాడు. కాళ్లకు రోలర్స్ కట్టుకొని గ్రౌండ్లో దిగాడంటే సెకెన్స్లో ఆ గ్రౌండ్ని చుట్టివస్తాడు. జాతీయ స్థాయి రోలర్ స్కేటింగ్ క్రీడల్లో నగరంలోని సికింద్రాబాద్ అన్నానగర్కు చెందిన సాత్విక్ మంచి ప్రతిభ కనబరుస్తున్నాడు. భవిష్యత్లో అంతర్జాతీయ స్థాయిలో స్వర్ణం సాధిస్తానని ఈ యువ స్కేటర్ ధీమా వ్యక్తం చేస్తున్నాడు.
రెండేళ్ల వయస్సు నుంచి శిక్షణ..
సికింద్రాబాద్ కంటోన్మెంట్లోని అన్నానగర్కు చెందిన శ్రీనివాస్, శ్యామల దంపతుల కుమారుడు చిన్న వయస్సు నుంచే స్కేటింగ్ క్రీడ మీద ఆసక్తి పెంచుకున్నాడు. సాత్విక్ తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి ఆట స్థలాలకి తీసుకెళ్లే వారు. అప్పుడే స్కేటింగ్ మీద ఆసక్తి పెంచుకున్న సాత్విక్ స్కేటింగ్ నేర్చుకుంటానని తల్లిదండ్రులతో చెప్పాడు. దీంతో తల్లిదండ్రులు సికింద్రాబాద్లో ఓ కోచ్ వద్ద శిక్షణ ఇప్పించారు.
పతకాలేన్నో..
గతేడాది నగరంలో జరిగిన పెయిర్ స్కేటింగ్ పోటీల్లో స్వర్ణ పథకాన్ని సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం సికింద్రాబాద్లోని టివోలి సమీపంలో ఉన్న అక్షర వాగ్దేవి స్కూల్లో నాలుగో తరగతి చదువుతున్నాడు. క్రీడలతో పాటు తమ కుమారుడు చదువుల్లోనూ రాణిస్తున్నాడని సాత్విక్ తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇటీవల ఏప్రిల్ 27వ తేదీ నుంచి మే 2వ తేదీ వరకు పంజాబ్ రాష్ట్రంలోని మొహాలీ స్టేడియంలో నేషనల్ ఇంటర్ డిస్టిక్ రోలర్ స్కేటింగ్ చాంపియన్షిప్ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో 20 రాష్ర్టాల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో తెలంగాణ నుంచి సాత్విక్ మూడు విభాగాల్లో తలపడ్డాడు. సోలో, పెయిర్, గ్రూప్ విభాగాల్లో జరిగిన పోటీల్లో సాత్విక్ స్వర్ణాలు గెలుపొందాడు.