బేగంపేట్, అక్టోబర్ 16: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను చూసి ప్రతిపక్ష పార్టీల నాయకులకు దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయిందని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. సోమవారం నెక్లెస్ రోడ్డులోని జలవిహార్లో మంత్రి తలసాని అధ్యక్షతన సనత్నగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. నియోజకవర్గంలో బీఆర్ఎస్కు ఎదురు లేదని, భారీ మెజార్టీతో గెలుపు తధ్యమన్నారు. రేషన్ ద్వారా పేదలకు సన్నబియ్యం, మరో లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లు, పేదలపై ఆర్థిక బారాన్ని తగ్గించేందుకు 400 వందలకే సిలిండర్, తదితర పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారని తెలిపారు. ఇక్కడి నుంచి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికై కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్రెడ్డి నాలుగున్నర ఏళ్లలో ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి ఒక్క రూపాయి అభివృద్ధి పనులు చేశారా? అని ప్రశ్నించారు. ఒక్క అవకాశం ఇవ్వాలని కోరుతున్న కాంగ్రెస్ అత్యధిక కాలం దేశం, రాష్ర్టాన్ని పాలించి ప్రజలకు ఏం చేశారో చెప్పే ధైర్యం ఉందా? అని విమర్శించారు. తాము ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాల గురించి మాట్లాడుతామని ఎన్నికల తదనంతరం అభివృద్ధి, ప్రజా సమస్యల పైనే దృష్టి సారిస్తామనేది అందరికి తెలుసని పేర్కొన్నారు. సనతనగర్లో ఈ నెల 19 నుంచి నియోజకవర్గంలో పాదయాత్రలు ప్రారంభించనున్నట్టు తెలిపారు. అలాగే వచ్చే నెల 9న భారీ ర్యాలీతో నామినేషన్ దాఖలు చేయనున్నట్టు చెప్పారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు కోలన్ లక్ష్మి, టి.మహేశ్వరి, హేమలత, మాజీ కార్పొరేటర్లు శేషుకుమారి, ఉప్పల తరుణి, ఆకుల రూప, కిరణ్మయికిశోర్, నాయకులు పవన్కుమార్గౌడ్, శ్రీనివాస్గౌడ్, శ్రీహరి, వెంకటేశంరాజు, హన్మంతరావు, శ్రీనివాస్, డివిజన్ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
20 ఏండ్లుగా కిరాయి కట్టలేక..
మేము 20 ఏండ్ల నుంచి కిరాయి ఇంట్లోనే ఉంటున్నాం. 2016లో ఆన్లైన్లో డబుల్ బెడ్ రూం ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నా. మాకు డబుల్ బెడ్ రూం ఇల్లు వచ్చిందని అధికారులు మాకు ఫోన్ చేసి చెప్పారు. డబుల్ బెడ్ రూం ఇల్లు ఇచ్చిన సీఎం కేసీఆర్ సారు చల్లగా ఉండాలి. మళ్లీ బీఆర్ఎస్ సర్కార్ రావాలని కోరుకుంటున్నా.
– కాకర్ల రమాదేవి, వల్లభాయ్ పటేల్ నగర్, చింతల్, లబ్ధిదారురాలు
దేవుడి లాంటి కేసీఆర్ వెంటే ..
పేద ప్రజలకు అండగా ఉన్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ సర్కారు. పేదలకు ముఖ్యమంత్రి కేసీఆర్ దేవుడిలా వరాలు కురిపిస్తున్నారు. అన్నింటా వెనుకబడి, దయనీయ జీవితాలు వెల్లదీస్తున్న వారి సొంతింటి కలను సాకారం చేసిన మహానుభావుడు కేసీఆర్ ఒక్కడే.
మాకు ఇటీవల డబుల్ బెడ్రూం ఇల్లు ఇచ్చారు. రాష్ట్రంలో నిరుపేదల కోసం ప్రవేశపెడుతున్న పథకాలు బాగున్నాయి. దేవుడిలాంటి
కేసీఆర్ వెంటే ఉంటాం.
– రేణుక, హైదర్గూడ,డబుల్ బెడ్రూం లబ్ధిదారురాలు
కేసీఆర్తోనే పేదలకు న్యాయం
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన డబుల్ ఇండ్ల పథకంతో అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరుగుతుందన్న విశ్వాసం ఉంది. డబుల్ బెడ్రూం ఇంటికి దరఖాస్తు చేసుకున్నా. మొదటి దఫాలో చాలా మందికి వచ్చినవి. మరో విడతలో వస్తుందన్న విశ్వాసం ఉంది. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలువాలి. ముచ్చటగా మూడవ సారి ముఖ్యమంత్రి కేసీఆర్ను అత్యధిక మెజార్టీతో
గెలిపించుకుంటే మరింత అభివృద్ధి జరగడం ఖాయం. మహిళల సంక్షేమానికి కృషి చేస్తున్న కేసీఆర్కు మహిళలందరి తరఫున ప్రత్యేక
కృతజ్ఞతలు.
– ఉమాదేవి, ఇజ్జత్ నగర్ కాలనీ,మాదాపూర్
లాటరీలో డబుల్ బెడ్రూం వచ్చింది
బన్సీలాల్పేట్ డివిజన్లోని రామస్వామి కాంపౌండ్ బస్తీలో 30 ఏండ్లుగా నాలా పక్కన గుడిసెలు వేసుకుని ఉంటున్నాం. రెండు ఇండ్లల్లో బాసండ్లు తోమి బతుకుతున్నా. ఆరేండ్ల కింద ఇల్లు కోసం దరఖాస్తు చేసుకున్నా. ప్రభుత్వం లాటరీ తీయగా నాకు ఇల్లు వచ్చిందని కలెక్టర్ ఆఫీసు నుంచి ఫోన్ వచ్చింది. ఇద్దరు కొడుకులు పెండ్లి చేసుకొని ఉండటానికి జాగ లేక బయట కిరాయికి ఉంటున్నారు. నాకు సొంత ఇల్లు రావడం చాలా ఆనందంగా ఉంది. ఇకపై నేను, నా కొడుకులతో కలిసి ఒకేచోట ఉంటాం. ఈ సర్కారుకు, సీఎం కేసీఆర్కు, మంత్రి శ్రీనివాస్ యాదవ్కు కృతజ్ఞతలు.
– ఎల్లమ్మ, బన్సీలాల్పేట్, డబుల్ లబ్ధిదారురాలు
సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం
చాలీచాలని జీతాలతో ఎన్నో సంవత్సరాలు బాధపడుతూ వస్తున్నాం. నేను టైలరింగ్ వర్క్ చేస్తా. మా ఆయన రోజువారి కూలీపని చేస్తడు. ఇద్దరం పనిచేసినా రూ.4000 కిరాయి, పిల్లలు ఫీజులు కట్టలేని పరిస్థితి మాది. ఇరుకు గదుల్లో 10 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. ఇలాంటి పరిస్థిల్లో మా సొంతింటి కల సాధ్యం కాదని అనుకున్న. కానీ సీఎం కేసీఆర్ వల్ల మా కల నిజమైంది. ఎంతో సంతోషంగా ఉంది. సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే ముఠాగోపాల్కు రుణపడి ఉంటాం.
ఆరోగ్యశ్రీ పరిధి పెంచడం సంతోషం
ఆరోగ్య శ్రీ పథకం పరిధిని రూ.15 లక్షలకు పెంచడం ద్వారా ఎంతో మంది ప్రజలకు మేలు జరగనుంది. గత ప్రభుత్వాల హయాంలో ప్రభుత్వ ఆసుపత్రులకు పోవాలంటే ప్రజలు భయపడేవారు. కానీ నేడు తెలంగాణ ప్రభుత్వ పరిపాలనలో ప్రభుత్వ ఆసుపత్రుల రూపురేఖలు మార్చడంతో పాటు నాణ్యమైన వైద్యం అందిస్తున్నరు. ప్రభుత్వ ఆసుపత్రులకు రద్దీ పెరిగింది. వైద్యం కోసం ప్రైవేట్ ఆసుపత్రులకు పోతే పెద్ద ఎత్తును పైసలు పెట్టాల్సి వస్తుంది. కుటుంబానికి రూ.15 లక్షల వరకు ఉచిత వైద్యం అందేలా చేయటం అంటే మాములు విషయం కాదు. గతంలో ఏ ప్రభుత్వాలు ఇలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. పేదల కష్టాలు తెలిసిన నాయకుడు కేసీఆర్.
– మారోజు శ్యామల, ఆర్కేపురం
కేసీఆర్ గొప్ప ఆలోచన చేసిండు
సీఎం కేసీఆర్ ఏ ఆలోచన చేసినా గొప్పగా ఉంటుంది. రెండు సార్లు అధికారంలోకి వచ్చిన తరువాత హామీ ఇచ్చినవి, ఇవ్వనివి కూడా నెరవేర్చిండు. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజలకు ఎంతో మేలు చేస్తుంది. ఎన్నికల మ్యానిఫెస్టోలో అర్హులైన ప్రతి ఒక్కరికి 5 లక్షల బీమా గొప్ప నిర్ణయం. ఎంతో మంది నిరుపేదలు అనుకోని పరిస్థితుల్లో చనిపోతే ఆ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. కుటుంబ యజమానికి చిన్న చిన్న పిల్లలు ఉంటే చాలా భారంగా ఉంటుంది. బీమా డబ్బులు వస్తే పిల్లల చదువులు, పెండ్లి, ఇతరత్రా ఖర్చులకు డోకా ఉండదు. ఎవరూ ఏమీ అడగకుండానే అన్నీ చేస్తున్నా సీఎం కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రావాలి. ఆయనను గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉంది.
– చంద్రారెడ్డి, రాఘవేంద్రనగర్, మేడ్చల్