సిటీబ్యూరో, జూన్ 6 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లాలోని ఆరు మండలాల పరిధిలో ఉన్న 16 ల్యాండ్ పార్సెల్స్ అమ్మకాలకు మంగళవారం హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో బేగంపేట్ టూరిజం ప్లాజా హోటల్లో నిర్వహించిన ప్రీబిడ్ సమావేశానికి అద్భుత స్పందన లభించింది. విక్రయానికి సంబంధించిన వివరాలను హెచ్ఎండీఏ ఎస్టేట్ ఆఫీసర్(ఈవో) బి.కిషన్ రావు ప్రీబిడ్ మీటింగ్కు హాజరైన బిల్డర్లు, డెవలపర్లకు వివరించారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్టీసీ ప్రతినిధి అనురాగ్ ఆన్లైన్ వేలం పద్ధతులు, నియమ నిబంధనలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. వేలం ద్వారా కొనుగోలు చేసిన ల్యాండ్ పార్సిల్స్కు నిబంధనలకు లోబడి రుణాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు బ్యాంకర్లు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు ప్రతినిధులు తెలిపారు.
ల్యాండ్ పార్సెల్స్పై ఔత్సాహిక వేత్తల సందేహాలను హెచ్ఎండీఏ ప్లానింగ్, ఇంజినీరింగ్, అకౌంట్స్ అధికారులు నివృత్తి చేశారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని నాలుగు మండలాల పరిధిలో ఉన్న 8 ల్యాండ్ పార్సెల్స్కు బుధవారం మేడ్చల్ కలెక్టరేట్లో ప్రీబిడ్ సమావేశం నిర్వహించనున్నట్లు హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. సంగారెడ్డి జిల్లాలోని మూడు మండలాల పరిధిలోని 10 ల్యాండ్ పార్సెల్స్కు గీతం యూనివర్సిటీలో గురువారం ప్రీబిడ్ సమావేశం నిర్వహించనున్నట్లు, ఈనెల 22న ఆన్లైన్ వేలం(ఈ-యాక్షన్)ద్వారా విక్రయించనున్నట్లు తెలిపారు.