మల్కాజిగిరి, మే 7: నకిలీ పత్రాలతో ప్లాట్ విక్రయించిన ఆరుగురిని మల్కాజిగిరి పోలీసులు అరెస్టు చేశారు. మల్కాజిగిరి ఇన్స్పెక్టర్ రవికుమార్ కథనం ప్రకారం.. మౌలాలి తిరుమలనగర్కు చెందిన వై. ఉషా(66) హెచ్ఎండీఏ విశ్రాంత ఉద్యోగి. 1982లో వసంత్విహార్ కాలనీలో 276 అడుగుల ప్లాట్ కొన్నారు. 2011లో ప్లాట్ చుట్టూ ప్రహారి నిర్మించి గేట్కు తాళం వేసి అమెరికాకు వెళ్లారు. 2023 జనవరి 19న తిరిగి వచ్చారు. తన ప్లాట్ గేటుకు గుర్తు తెలియని వ్యక్తి మరో తాళం వేశారని స్థానికులు ఉషాకు తెలిపారు. అనుమానంతో ఉషా ఈసీ తీయగా ప్లాట్ తన పేరుపైన ఉంది.
ఏప్రిల్ 29న మల్కాజిగిరి సబ్ రిజిస్ట్రార్కు తన ప్లాట్ను బ్లాక్ లిస్ట్లో పెట్టమని ఫిర్యాదు చేశారు. అయితే ఏప్రిల్ 24న ఉప్పల్కు చెందిన పెద్దమ్మ రాజుకు ప్లాట్ రిజిస్ట్రేషన్ జరిగినట్లు అధికారులు తెలిపారు. దీంతో ఉషా పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని శనివారం వరంగల్కు చెందిన పెద్దమ్మ రాజు(39), హబ్సిగూడకు చెందిన సయ్యద్ జావిద్ (36), మల్లాపూర్కు చెందిన గూడ యాదగిరి (61), అల్వాల్ కానాజీగూడకు చెందిన ముత్రక హరిప్రసాద్(37), హబ్సిగూడకు చెందిన మహ్మద్ నసీరుల్లా(49), మౌలాలి కస్తూర్బానగర్కు చెందిన మహ్మద్ షానవాజ్(38)ను అదుపులోకి తీసుకుని పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించారు. నకిలీ పత్రాలు తయారు చేసి ప్లాట్ను విక్రయించామని ఒప్పుకున్నారు. వీరి నుంచి నకిలీ సేల్ డీడ్, ఇతర నకిలీ పత్రాలు, నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసికుని వీరిని రిమాండ్కు తరలించారు.