సిటీబ్యూరో, మే 25 (నమస్తే తెలంగాణ): నత్తనడకన సాగుతున్న సాహితీ ఇన్ఫ్రా కేసు దర్యాప్తు మళ్లీ మొదటికి వచ్చిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దర్యాప్తు అధికారులు మారడంతో విచారణలో తీవ్ర జాప్యం జరిగే అవకాశాలు లేకపోలేదని, దీని వల్ల దర్యాప్తు పారదర్శకంగా జరుగుతుందనే నమ్మకం లేదంటూ ఇన్ఫ్రా బాధితులు రోడెక్కారు. మొన్నటి వరకు సాహితీ కేసు దర్యాప్తు అధికారిగా ఉన్న సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వర్రావు అవినీతి, అక్రమ ఆస్తుల కేసులో అరెస్టు కావడంతో ఇన్ఫ్రా కేసు దర్యాప్తు ప్రశ్నార్థకంగా మారిందని బాధితులు వాపోతున్నారు.
ఏసీబీకి పట్టుబడిన ఏసీపీ ఉమామహేశ్వర్రావు సాహితీ ఇన్ఫ్రా కేసు దర్యాప్తులో పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడటం వల్ల తమకు తీరని అన్యాయం జరిగినట్లు కూడా కొందరు బాధితులు ఆరోపిస్తున్నారు. కాగా సాహితీ ఇన్ఫ్రా, దాని అనుబంధ సంస్థలపై ఇప్పటివరకు దాదాపు 58 కేసులు నమోదయ్యాయి. వందలాది మంది బాధితులు క్రమంగా బటయకు వస్తూ ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ కేసులో రూ.2 వేల కోట్ల వరకు మోసం జరిగినట్లు అంచనా.
సాహితీ శర్వాని ఎలైట్ అమీన్ పూర్ బాధితులు శనివారం సీసీఎస్ ముందు ధర్నాకు దిగారు. సా హితీ ఇన్ ఫ్రా డైరెక్టర్ లను అరెస్ట్ చేయాలని, తమకు న్యాయం చేయాలని, నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రీ లాంఛ్ పేరుతో కోట్లు కాజేసి తప్పించుకొని తిరుగుతున్న సాహితీ ఇన్ ఫ్రా ఎండీ లక్ష్మీనారాయణతోపాటు ఇతర డైరెక్టర్ లను వెంటనే అరెస్ట్ చేయాలని, సాహితీ ఇన్ ఫ్రాలో తాము కట్టిన డబ్బు తిరిగి ఇప్పించాలని డిమాండ్ చేశారు. సాహితీ ఇన్ ఫ్రా ప్రీ లాంఛ్ పేరుతో 2017లో అమీన్ పూర్ లో వెంచర్ వేసి వందలాది మందికి విక్రయించారని తెలిపారు. ఏండ్లు గడుస్తున్నా కేసు దర్యాప్తు కొలికి రావడంలేదని, తమకు న్యాయం జరగడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
సాహితీ ఇన్ ఫ్రా డైరెక్టర్ లు నగరం నలుమూలల్లో 10 నుంచి 15 వెంచర్లు వేసి, ప్రీ లాంఛ్ పేరుతో విక్రయాలు జరిపారన్నారు. కొన్ని వెంచర్లలో ఒకో ప్లాటును ఇద్దరికి, ముగ్గురికి కూడా రిజిస్ట్రేషన్ లు చేశారని బాధితులు ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో సాహితీ ఇన్ ఫ్రా డైరెక్టర్ లు, ఎండీపై కేసులు నమోదు చేసినా న్యాయం జరగలేదన్నారు. ఈ సందర్భంగా ధర్నా చేస్తున్న బాధితులను సీసీఎస్ డీసీపీ శ్వేత కలిసి మాట్లాడారు. కేసు దర్యాప్తులో ఉందని, కేసు విచారణకు కొత్త అధికారిని నియమిస్తామని తెలిపారు. సాహితీ ఇన్ ఫ్రా పేరున ఉన్న ఆస్తులను గుర్తించే పనిలో ఉన్నామని త్వరలోనే వివరాలను వెల్లడిస్తామన్నారు.