కుత్బుల్లాపూర్, నవంబర్16 : గేటెడ్ కమ్యూనిటీ పేరుతో కొనుగోలుదారుల నుంచి డబ్బులు తీసుకొని, ముఖం చాటేసినా సాహితీ ఇన్ఫ్రాటెక్ వెంచర్ ప్రైవేట్ లిమిటెడ్ డెవలపర్ల బాగోతం బయటపడింది. బాధితులు బుధవారం పేట్ బషీరాబాద్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. సీఐ ప్రశాంత్ తెలిపిన వివరాల ప్రకారం…గుండ్లపోచంపల్లిలో సాహితీ ఇన్ఫ్రాటెక్ వెంచర్స్ ప్రైలిమిటెడ్, ఎస్వీఎన్ఆర్ ఇన్ఫ్రా ఆధ్వర్యంలో గేటెడ్ కమ్యూనిటీ పేరుతో ఏర్పాటు చేసిన వెంచర్లలో ప్లాట్ల నిర్మాణం కోసం ఒక్కొక్క కస్టమర్ నుంచి రూ.8.50లక్షలు 2020లో వసూలు చేశారు.
2023 నాటికి నిర్మాణ పనులు పూర్తి చేస్తామని నమ్మించారు. కొంత మంది బాధితులు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని డబ్బులు చెల్లించారు. నిర్మాణ పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతుండటంతో బాధితులు వెంచర్ను పరిశీలించేందుకు వెళ్లగా.. అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. మోసపోయినట్టు గ్రహించిన బాధితులు చెరుపల్లి రఘుపతిరెడ్డితో పాటు మరో ఎనిమిది మంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.