ఖైరతాబాద్, నవంబర్ 1: దాదాపు హైదరాబాద్ మహా నగరంలో తప్ప మరోచోట ఎక్కడా కన్పించని దున్నపోతుల విన్యాసాలతో కూడిన సదర్ ఉత్సవాన్ని నగరంలో యాదవులు పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. ఇందుకు దున్నలను భారీ స్థాయిలో అలంకరించి నగరం భారీ స్థాయిలో సందడిని నెలకొల్పుతారు. భాగ్యనగరానికి అనాదిగా వస్తున్న సంప్రదాయ వేడుక సదర్ ఉత్సవం. వందలాది దున్నపోతులతో విన్యాసాలు, ప్రదర్శనలు ప్రతి ఏడాది నగరవాసులను అబ్బురపరుస్తాయి. దీపావళి తర్వాత రోజు ఈ వేడుకలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. ఈ ఏడాది కూడా సదరోత్సవానికి నగరవాసులు సన్నద్ధమవుతున్నారు. సదర్ అంటే గుర్తుకు వచ్చేది రాణా. హర్యానాకు చెందిన మేలు రకం దున్నపోతు.
దీనికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. అనేక పోటీల్లో అగ్రస్థానంలో నిలిచిన ఈ దున్నపోతుకు నిర్వాహకులు ప్రేమతో ‘లవ్ రాణా’ అని నామకరణం చేశారు. గతేడాది నిర్వహించిన సదర్ వేడుకల్లోనూ రాణా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ఏడాది మరో దున్నపోతు షారుఖ్ ఈ వేడుకలకు మరింత వన్నె తీసుకురానున్నది. ఈ రెండు దున్నపోతులను దూద్వాలా డైరీ ఫామ్స్ నిర్వాహకుడు మధు యాదవ్ ముస్తాబు చేస్తున్నారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం ఖైరతాబాద్లోని శాఖ మైదానంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దూద్వాలా డైరీ, సూపర్ డైరీ ఫామ్స్ నిర్వాహకులు మధు యాదవ్, చందు యాదవ్, లక్ష్మణ్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్లు వివరాలను వెల్లడించారు.
‘లవ్ రాణా’ గతంలోనూ అనేక సదర్ వేడుకల్లో పాల్గొని అగ్ర స్థానంలో నిలిచింది. నాలుగేళ్ల వయస్సు గల రాణా బరువు సుమారు 1700 కేజీలు ఉంటుంది. దీన్ని హర్యానా నుంచి నిర్వాహకుడు మధు యాదవ్ తెప్పించారు. అలాగే, మరో దున్నపోతు షారుఖ్కు కేవలం మూడున్నర సంవత్సరాల వయస్సు ఉన్నా అత్యధికంగా 1800 కేజీల బరువు, ఆరున్నర అడుగుల ఎత్తులో ఉంటుంది. ప్రతి రోజు ఒక కిలో బాదం, కాజు, పిస్తా, డ్రైఫ్రూట్, ఐదు కేజీల ఆపిల్స్, 20 లీటర్ల పాలు, పొద్దున, సాయంత్రం 20 చొప్పున 40 గుడ్లు, వారానికి ఒక స్కాచ్ విస్కీ తాగిస్తారు. బాటిల్ ఎత్తి తాగిస్తే నిమిషాల వ్యవధిలో ఫుల్ బాటిల్ను లాగించేస్తుంది. వీటి బాగుగోలు చూసుకునేందుకు ఒక్కో దున్నపోతుకు ఇద్దరేసి కార్మికులను నియమించారు. ప్రతి రోజు వాకింగ్, స్విమ్మింగ్ చేయిస్తారు. రక్త ప్రసరణ సరిగా జరిగేందుకు నువ్వుల నూనెతో ఆయిల్ మసాజ్ చేస్తారు. రోజుకు ఒక్కో దున్నపోతుకు రూ.10వేల నుంచి రూ.20వేల వరకు ఖర్చు వస్తుందని నిర్వాహకులు తెలిపారు.
హర్యానా లాంటి రాష్ర్టాలో ఈ మేలు రకం దున్నపోతుల నుంచి కొన్ని మిల్లీ లీటర్ల వీర్యాన్ని వెయ్యి రూపాయలు ఆపై విక్రయిస్తారు. తద్వారా కోట్లాది రూపాయల ఆదాయం సంపాదిస్తారు. రాష్ట్రంలో పాడి పరిశ్రమ అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో మా దున్నపోతులకు సంబంధించిన వీర్యాన్ని ఉచితంగానే అందిస్తాం. వీటి ద్వారా జన్మించే గేదెలకు రోజుకు 25 లీటర్లకు పైగా పాలు వస్తాయి. ఈ నెల 5వ తేదీన ఖైరతాబాద్లో జరిగే సదర్ వేడుకల్లో ‘లవ్ రాణా, షారుఖ్’తో పాటు మరో ఎనిమిది దున్నలు పాల్గొంటాయి. – మధు యాదవ్, దూద్వాలా డెయిరీ నిర్వాహకుడు