మెహిదీపట్నం, డిసెంబర్ 1 : ప్రజలకు ముఖ్యంగా కళాశాలల విద్యార్థులకు మెరుగైన సేవలందించడానికి అవసరమైన రూట్లలో అదనంగా బస్సులను నడుపుతున్నట్లు చార్మినార్ ఆర్టీసీ డీఆర్ఎం విజయ్భాను అన్నారు. గురువారం మెహిదీపట్నం డిపోలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మెహిదీపట్నం డిపో మేనేజర్ జి.వి.సూర్యనారాయణ, అసిస్టెంట్ మేనేజర్ ఎం.కరుణా శ్రీలతో కలిసి వివరాలు వెల్లడించారు. డీఆర్ఎం డి.విజయ్భాను మాట్లాడుతూ.. మొయినాబాద్, శంకర్పల్లి రూట్లలో 14 పెద్ద కాలేజీలు ఉండటంతో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచాలని ఎండీ ఆదేశించారని తెలిపారు. ఇప్పటికే శంకర్పల్లి రూట్లో 17 ట్రిప్పులు, మొయినాబాద్ రూట్లో 24 ట్రిప్పులు బస్సులు నడుస్తున్నాయన్నారు.
ఎండీ ఆదేశాలతో మొయినాబాద్, శంకర్పల్లి రూట్లలో సర్వే నిర్వహించి బస్సుల సంఖ్యను పెంచాలని నిర్ణయించామని, ఈ మేరకు ఫలక్నుమా, ఫరూక్నగర్, బర్కత్పురా, ముషీరాబాద్ డిపోల నుంచి రెండు చొప్పున బస్సులను నడుపడం జరుగుతుందని అన్నారు. విద్యార్థులు రద్దీగా ఉన్న సమయంలో ఈ బస్సులను మెహిదీపట్నం రైతుబజార్ వద్దకు పంపి విద్యార్థులకు అందుబాటులో ఉంచుతామని చెప్పారు. అక్కడ విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా బస్సులు ఎక్కే విధంగా డిపో మేనేజర్ను, అసిస్టెంట్ మేనేజర్ను, ఇద్దరు సెక్యూరిటీ గార్డులను పెట్టి బస్సుల్లో విద్యార్థులు సాఫీగా ప్రయాణించేలా చర్యలు తీసుకుంటామన్నారు. అంతేకాకుండా కాంబో టికెట్ను రూ.20 నుంచి రూ.10లకు తగ్గించామని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.