సిటీబ్యూరో, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ) : స్కూల్ జోన్లో ఆర్టీఏ ప్రత్యేక డ్రైవ్ చేస్తున్నది. ఫిట్నెస్ లేని వాహనాల్లో విద్యార్థుల రాకపోకలు సాగిస్తుండటంపై అధికారులు దృష్టి సారించారు. నగరంలోని స్కూల్ జోన్లలో ఆర్టీఏ స్కూల్ వ్యాన్లు, ఆటోలను తనిఖీలు చేస్తున్నారు. చాలా వాహనాలు ఫిట్నెస్ లేకుండానే విద్యార్థులను తరలిస్తూ వారి భద్రతపై నిర్లక్ష్యం చేస్తున్నట్టు అధికారుల దృష్టికి వచ్చింది. పొగలు కక్కుతున్న వ్యాన్లు, ఆటోలను పరిశీలించి సీజ్ చేస్తున్నారు.
ఇటీవల ఓ స్కూల్ వద్ద పొగలు చిమ్ముతున్న వ్యాన్లను ఫొటోలు తీసి ఆర్టీఏ అధికారులకు విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు అప్రమత్తమై నగరంలోని అన్ని స్కూల్ జోన్లలో పొగలు వీస్తున్న వాహనాలపై దృష్టి సారించారు. సాధారణంగా పొగలు చిమ్ముతున్న వాహనాల నుంచి విడుదలయ్యే ప్రమాదకర రసాయనాల వల్ల ఎనీమియా సంభవించే అవకాశం ఉంది. కిడ్నీ, మెదడు పనితీరు క్షీణిస్తుంది. అధికంగా విడులయ్యే లెడ్ వల్ల ఒక్కోసారి మరణం కూడా సంభవించే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఊపిరితిత్తుల పనితీరును క్షీణింపజేస్తోంది. శ్వాసకోశ సమస్యలకు దారితీస్తుంది. సల్ఫర్డయాక్సైడ్తో స్కిన్, కండ్లు, ముక్కు, గొంతు, ఊపిరితిత్తులు పాడయ్యే ప్రమాదం ఉంది. తలనొప్పి, అలసట, కండ్లలో మంటలు తదితర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఇంతటి ప్రమాదం ఉండటంతో విద్యార్థుల భధ్రతను సీరియస్గా తీసుకున్నారు. పాత వాహనాలతో రోడ్లెక్కుతున్న వారిపై ఆర్టీఏ అధికారులు చర్యలు తీసుకోనున్నారు. అందులో భాగంగానే పొల్యూషన్ వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. ఇప్పటి వరకు ప్రైవేట్ సంస్థలు వాహనాల కాలుష్య తనిఖీలు చేసి సర్టిఫికెట్స్ జారీ చేస్తున్నాయి. ఆ వివరాలన్నీ సెంట్రల్ సర్వర్లో అప్లోడ్ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా పొల్యూషన్ తనిఖీల్లో ఇటీవల 12 ఆటోలు, 6 స్కూల్ వ్యాన్లు, 7 ద్విచక్ర వాహనాలు, 6 ఫోర్వీలర్స్ను ఆర్టీఏ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్కూల్ బస్సులు పొల్యూషన్ టెస్ట్లు తప్పనిసరిగా చేయించుకోవాలని అధికారులు సూచించారు.