సిటీబ్యూరో, జనవరి 25 (నమస్తే తెలంగాణ): నగరంలో నకిలీ ఔషధాల తయారీ కలకలం సృష్టిస్తున్నది. కొన్ని కంపెనీలు ఆహార ఉత్పత్తుల తయారీ కోసం అనుమతులు తీసుకుని నకిలీ ఔషధాలు తయారు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో డ్రగ్ కంట్రోల్ అథారిటీ అధికారులు కొన్ని రోజులుగా వరుస దాడులు జరుపుతున్నారు. గురువారం కూకట్పల్లి, ఐడీఏ ప్రశాంతినగర్లోని ఎస్ఎల్ హెల్త్ కేర్పై డీసీఏ అధికారులు దాడులు జరిపారు. ఈ కంపెనీ నిబంధనలకు విరుద్ధంగా ఔషధాలను తయారు చేస్తున్నట్లు గుర్తించారు.
‘ఆర్థో-డీ’, ‘ప్రెగవిట్-ఎం’ను రూపొందించి మార్కెట్లో విక్రయిస్తున్నట్లు తేలింది. ఈ ఔషధాలు తయారు చేయాలంటే తప్పనిసరిగా డీసీఏ నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుంది. కానీ నిర్వాహకులు నిబంధనలకు విరుద్ధంగా ఆహార ఉత్పత్తుల ముసుగులో అర్హతలేని వారితో ఔషధాలను తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నట్లు డీసీపీ నిర్ధారించింది. ఈ మేరకు రూ. 2.90 లక్షల విలువైన మందులను సీజ్ చేసినట్లు డ్రగ్ కంట్రోల్ అథారిటీ డీజీ కమలాసన్రెడ్డి తెలిపారు.