సిటీబ్యూరో, మే 5 (నమస్తే తెలంగాణ): మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగాలిప్పిస్తామంటూ టెలీగ్రామ్ యాప్లో ప్రకటనలిచ్చి ఏడుగురి వద్ద నుంచి రూ.46.19 లక్షలు వసూలు చేసిన బెంగళూర్కు చెందిన ఓ సైబర్ నేరగాడిని సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. సైబర్క్రైమ్స్ డీసీపీ కవిత కథనం ప్రకారం.. బెంగళూర్ దొండబెల్లాపూర్కు చెందిన ఎస్. మహేశ్ టెలీగ్రామ్ యాప్లో ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగాలంటూ.. ఒక ప్రకటన ఇచ్చాడు. దీనిని చూసిన యూసుఫ్గూడకు చెందిన బాధితుడు, అతడి స్నేహితుడు అందులోని ఫోన్ నంబర్లో సంప్రదించారు.
ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తామని, అయితే కొంత ఖర్చవుతుందంటూ నమ్మించాడు. మొదట రిజిస్ట్రేషన్ ఫీజు అంటూ వసూలు చేయడం ప్రారంభించాడు. అనంతరం ఆన్లైన్లో ఇంటర్వ్యూలు నిర్వహించి, అది ఫలానా కంపెనీ నుంచే నిర్వహిస్తున్నామని బాధితులను నమ్మించాడు. ఇంటర్వ్యూల తరువాత మీ ప్యాకేజీలు ఫిక్స్ అయ్యాయంటూ నమ్మించి.. దఫ దఫాలుగా ఏడుగురి నుంచి రూ. 46.19 లక్షలు వసూలు చేశాడు. ఆ తరువాత ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగమంటూ నకిలీ అపాయింట్మెంట్ లెటర్లు పంపించాడు. బాధితులు వాటిని పరిశీలించి వాకబు చేయగా అన్ని నకిలీవని గుర్తించి, 2023లో సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇన్స్పెక్టర్ మధుసూదన్రావు బృందం కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేపట్టింది. నిందితుడు బెంగళూర్లో ఉన్నట్లు గుర్తించి అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.