సిటీబ్యూరో, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ)/మెహిదీపట్నం: పీడీ యాక్టు పెట్టి జైలుకు పంపినా.. కొంత మంది రౌడీషీటర్ల మైండ్ సెట్ మారడం లేదు. పోలీసుల నిఘా ఉన్నా.. నేరాలు చేస్తూనే ఉన్నారు. ఇందులో ఒకరు చోర్ కైసర్. సుపారీ తీసుకొని మర్డర్ చేసేందుకు ఒప్పందం చేసుకున్నాడు.హత్య చేయకపోవడంతో పని అప్పగించిన వ్యక్తి తన ఒప్పందాన్ని రద్దు చేసుకొని.. ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వాలని కోరాడు. దీంతో కైసర్ అతడిని బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడు.
బాధితుడి ఫిర్యాదుతో హబీబ్నగర్ పోలీసులు వెంటనే చర్యలకు ఉపక్రమించారు. సౌత్- వెస్ట్జోన్ డీసీపీ బాలస్వామి కథనం ప్రకారం.. హైదరాబాద్లో కరుడుగట్టిన ఘరానా రౌడీషీటర్లలో ఒకరు మహ్మద్ కైసర్ అలియాస్ చోర్ కైసర్. అతడిపై 22కు పైగా కేసులున్నాయి. హత్యలు, బెదిరింపులు, కబ్జాలు, దాడులు తదితర కేసులు ఉన్నాయి. కైసర్పై 2014లో పీడీ యాక్టు ప్రయోగించారు. రౌడీ దందాలు చేస్తూ వంద కోట్లకు పైగానే సంపాదించాడు.
ఇదిలా ఉండగా.. 2016లో గుడిమల్కాపూర్కు చెందిన వనరాసి యాదగిరి సోదరుడు రాజును కొందరు హత్య చేశారు. సోదరుడిని హత్య చేసిన వారిపై యాదగిరి పగ పెంచుకున్నాడు. నిందితులను హతమార్చేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టాడు. ఈ క్రమంలోనే రౌడీషీటర్ చోర్ కైసర్ను సంప్రదించాడు. తన ప్రత్యర్థులను హతమార్చాలని కోరిన యాదగిరి.. రూ.2 లక్షలు ఇస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు. కైసర్ తన అనుచరులతో మాట్లాడి.. ముందుగానే యాదగిరి వద్ద నుంచి రూ.2 లక్షలు తీసుకున్నాడు.
అయితే, ప్రత్యర్థులను హతమార్చడంలో కైసర్ కాలయాపన చేయడంతో యాదగిరి తన ఒప్పందాన్ని రద్దు చేసుకొని.. డబ్బు తిరిగి ఇవ్వాలని కోరాడు. దీంతో యాదగిరిని బెదిరించిన కైసర్.. తనకు రూ.4 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. లేకపోతే యాదగిరినే చంపేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. భయపడ్డ యాదగిరి అతడు అడిగినట్లుగా దఫ దఫాలుగా డబ్బులిస్తూ వచ్చాడు. అయినా.. రౌడీషీటర్ బ్లాక్ మెయిలింగ్ ఎక్కువ కావడంతో యాదగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న హబీబ్నగర్ పోలీసులు, నిందితుడైన కైసర్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.