సిటీబ్యూరో, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ)/ బంజారాహిల్స్ : 148 కిలోల అధిక బరువుతో బాధపడుతున్న ఓ వ్యక్తికి నగరంలోని కేర్ హాస్పిటల్లో విజయవంతంగా రోబోటిక్ ఆధారిత బేరియాట్రిక్ సర్జరీ నిర్వహించినట్లు దవాఖాన వర్గాలు వివరాలు వెల్లడించాయి. 26 సంవత్సరాల వయస్సు గల ఓ వ్యక్తి 148కిలోల బరువుతో బీపీ, షుగర్ తదితర కొమార్పిడిటీస్ వ్యాధులతో బాధపడుతున్నాడు. దీంతో బరువు తగ్గించుకోవాలని వైద్యులు సూచించడంతో సదరు రోగి ఇటీవల కేర్ను ఆశ్రయించాడు.
ఈ మేరకు కేర్ వైద్యులు డాక్టర్ వేణుగోపాల్ నేతృత్వంలో ‘హ్యుగో రోబొటిక్ అసిస్టెడ్ సర్జరీ సిస్టమ్ ద్వారా రోగికి బేరియాట్రిక్ సర్జరీ చేశారు. ఇందులో భాగంగా రోగి జీర్ణకోశంలోకి సన్నటి ట్యూబ్ లాంటి పౌచ్ లేదా స్లీవ్ను పంపినట్లు వైద్యులు పేర్కొన్నారు. ఈ తరహా శస్త్రచికిత్స తెలుగు రాష్ర్టాల్లోనే తొలిసారిగా చేసినట్లు కేర్ దవాఖాన వైద్యులు తెలిపారు.