సిటీబ్యూరో, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ): ఎన్ని చేసినా రోడ్డు ప్రమాదాలు తగ్గడంలేదు. పోలీసులు కఠినంగా వ్యవహరించినా వాహనదారుల్లో ఆశించిన మార్పు రావడంలేదు. దీంతో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయే తప్ప.. తగ్గుతలేవు. అందులోనూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో పాదచారులే అధిక సంఖ్యలో మరణిస్తున్నారు. ప్రమాదాల నుంచి పాదచారులను తప్పించేందుకు 31 చోట్ల పెలికాన్ సిగ్నల్స్ ఏర్పాటు చేసినా.. గత ఏడాది కంటే ఈ సంవత్సరం మృతుల సంఖ్య అధికంగానే ఉంది. డ్రంక్ అండ్ డ్రైవ్, ఓవర్ స్పీడ్ను తగ్గించడం, నిర్లక్ష్యం డ్రైవింగ్పై పోలీసులు కొరఢా ఝలిపిస్తున్నారు. 2023లో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 121 మంది పాదచారులు మృతి చెందారు. 2022లో ఈ సంఖ్య 110 గా ఉంది. మృతిచెందిన పాదచారుల్లో ఎక్కువ సంఖ్యలో వృద్ధులు, యాచకులే ఉన్నారు. ఆ తరువాత ఉదయం, సాయంత్రం వాకింగ్ చేసే వారి సంఖ్య ఉంది. హైదరాబాద్లో ప్రతి సంవత్సరం వేలాది కొత్త వాహనాలు రోడ్డుపైకి వస్తున్నాయి.
2014లో 42 లక్షల వాహనాలు ఉండగా.. 2023లో 83 లక్షలకు పెరిగాయి. పెరుగుతున్న వాహనాల సంఖ్యతో ఎలాంటి ఇబ్బందులు రాకుండా.. రోడ్డు ప్రమాదాలకు తావులేకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ప్రమాదాలకు కారణమైన డ్రంక్ అండ్ డ్రైవ్లో ఈ ఏడాది 37,866 కేసులు నమోదు చేశారు. ఇదిలాఉండగా.. రోడ్డు ప్రమాదాలను తగ్గించడంలో భాగంగా రాగ్ (రోడ్డు యాక్సిడెంట్ అనాలసిస్ గ్రూప్)ను ఏర్పాటు చేసి, ప్రమాదానికి కారణాలను విశ్లేషించి తెలుసుకుంటున్నారు. సంబంధిత శాఖలను సమన్వయం చేసుకుంటూ ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నారు. నగర వ్యాప్తంగా 65 ప్రాంతాల్లో ప్రమాదాలు అధికంగా జరుగుతున్నట్టు అధికారులు గుర్తించారు. వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే చాలా వరకు రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని సీనియర్ పోలీసు అధికారులు చెబుతున్నారు. ట్రాఫిక్ రూల్స్పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టినట్టు చెప్పారు.
ట్రాఫిక్ సాఫీగా వెళ్లే విధంగా చేస్తూ వాహనదారులు పక్కాగా నిబంధనలు పాటించే విధంగా అవగాహన తేవడం, నిబంధనలు అతిక్రమించే వారిపై కేసులు నమోదు చేస్తూ ట్రాఫిక్ పోలీసులు పలు చర్యలు తీసుకున్నారు. రోడ్డు ప్రమాదాలు అర్ధరాత్రి తరువాత ఎక్కువగా జరుగుతున్నాయి. దీంతో అర్ధరాత్రి సమయంలో అతివేగం, నిర్లక్ష్యం డ్రైవింగ్పై పోలీసులు ఫోకస్ పెట్టారు. అతివేగాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. దీంతో 2023లో అర్ధరాత్రి తరువాత 1,11,736 కేసులు నమోదు చేశారు. ఎన్ఫోర్స్మెంట్ 2022తో పోలిస్తే, 2023లో 7 శాతం పెరిగింది.