సిటీబ్యూరో, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ): షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్ల వద్ద ట్రాఫిక్ రద్దీ ఏర్పడకుండా సరైన పార్కింగ్ సౌకర్యాలు కల్పించుకోవాలని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస రావు సూచించారు. మంగళవారం సైబరాబాద్ పరిధిలోని షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్ యాజమాన్యలతో పాటు ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ అధికారులతో కమిషనరేట్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. షాపింగ్ మాల్స్, మల్టీ ప్లెక్స్ల వద్ద సాధారణ వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గించేందుకు అందరం కలిసి సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఎంట్రీ, ఎగ్జిట్ నిబంధనల మేరకు ఉండాలన్నారు. వాహనాల పార్కింగ్ను క్రమపద్ధతిలో చేయించాలని సూచించారు. యాజమాన్యాలు తగిన సహకారం అందిస్తే రోడ్లపై ట్రాఫిక్ సాఫీగా వెళ్లేందుకు సులభమవుతుందన్నారు. మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి మాట్లాడుతూ.. సెక్టార్ సబ్ ఇన్స్పెక్టర్లు, ఇన్స్పెక్టర్లు ఏవైనా ఇబ్బందులు వస్తే వెంటనే సమాచారం అందించాలన్నారు. ఈ సమావేశంలో ట్రాఫిక్ అదనపు డీసీపీలు నంద్యాల నర్సింహారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ఏసీపీలు హన్మంతరావు, రఘునందన్రావు తదితర సిబ్బంది పాల్గొన్నారు.