సిటీబ్యూరో, మే 26 (నమస్తే తెలంగాణ) : దూరపు కొండలు నునుపు అన్నట్లుగా సామాన్యుడి జీవితం మారుతోంది. ఉద్యోగ, ఉపాధి కోసం పట్నం బాటపట్టే ఎంతో మంది.. చాలీచాలనీ జీతాలతో నెట్టుకొస్తున్నారు. ఇంటి ఖర్చులు, రవాణా, విద్య, వైద్యం ఇలా రోజు వారీ ఖర్చులు గణనీయంగా పెరుగుతుండటంతో…. వచ్చే జీతం డబ్బులు ఏ మూలకు సరిపోవడం లేదు. హోమ్ క్రెడిట్ సంస్థ చేసిన ద ఇండియన్ గ్రేట్ వాలెట్ సర్వే.. మెట్రో నగరాల్లో సామాన్యుడి ఆర్థిక స్థితిగతులను వెల్లడించింది. దేశంలోని అన్ని మెట్రో నగరాల్లో ఉండే వారి ఆదాయం, ఖర్చులు, అప్పులను పరిగణనలోకి తీసుకుని నివేదిక రూపొందించగా… ఖర్చులకు తగినట్లుగా ఆదాయంలో వృద్ధి లేదని తేలింది. ముఖ్యంగా హైదరాబాద్లోనే ఖర్చులు ఎక్కువగా ఉన్నట్లు తేలింది.
దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన మెట్రో నగరాల నివాసితుల ఆదాయ, వ్యయాలపై అధ్యయనం చేసింది. దీనిలో ప్రధానంగా 30వేల లోబడి జీతభత్యాలపై ఆధారపడిన వారి సంఖ్య 3శాతం, రూ. 30-50వేల లోపు 11శాతం, రూ. 50వేల పైబడిన వారి సంఖ్య 60 శాతం మందితో సేకరించిన వివరాల ప్రకారం అధ్యయనం చేశారు. వీరిలో స్వయం ఉపాధి, వేతనం, బిజినెస్పై ఆధారపడి ఉండగా, సర్వేలో పాల్గొన్న వారిలో ఎక్కువగా మగవారే ఉన్నారు. మొత్తం 10కిపైగా ప్రధాన నగరాల్లో వివరాలను సేకరించి, అధ్యయనం చేసిన ఫలితాలను హోమ్ క్రెడిట్ సంస్థ వెల్లడించింది.
తొలుత నెలవారీ ఆదాయ వివరాలను సేకరించగా… ఇందులో గతేడాది కాలంగా జీతభత్యాల్లో రూ. 3వేలకు మించి పెరగని వారీ సంఖ్యే ఎక్కువగా ఉంది. 2023లో రూ. 30వేల జీతం ఉంటే, ఈ ఏడాది నాటికి రూ. 33వేలు సగటున మంత్లీ ఇన్కం ఉందని తేల్చారు. అదే సమయంలో ఏడాదిలో పెరిగిన ఖర్చులను లెక్కిస్తే.. పెరిగిన జీతం ఏ మూలకు సరిపోవడం లేదని వెల్లడైంది. 2023లో 16వేల నెలవారీ ఖర్చులు ఉండే ఈ ఏడాది మే 1 నాటికి రూ. 19వేలకు చేరింది. ఇందులో ఇంటి అద్దె, వైద్యం, నిత్యావసర సరుకులు, నిర్వహణ పోను వచ్చే జీతంలో మిగిలేది చాలా తక్కువగానే ఉంది. ప్రధాన నగరాల్లో ఆదాయ, ఖర్చులను పోల్చితే… హైదరాబాద్లోనే అత్యధికంగా ఉండటం గమనార్హం. నెలవారీ ఆదాయం రూ. 44వేలు ఉంటే ఇందులో.. రూ. 24వేల నెలవారీ నిర్వహణ ఖర్చులకు చెల్లించాల్సి వస్తుందని గుర్తించారు. నెలవారీ ఖర్చుల విషయంలో హైదరాబాద్ మిగిలిన మెట్రో నగరాల కంటే ఎక్కువగా ఉండగా… అత్యల్పంగా చెన్నయ్ నగరంలో నెలవారీ ఖర్చులు రూ. 14వేలుగా ఉంది.
దేశంలోని ప్రధాన మెట్రో నగరాలైన బెంగళూరు, ముంబై, చెన్నై, పుణె, ఢిల్లీ, కోల్కతా వంటి నగరాలతో పోల్చితే హైదరాబాద్లోనే అత్యధికంగా నెలవారీ ఖర్చులు ఉంటున్నాయి. ఆ తర్వాత స్థానంలో బెంగళూరు, పుణె నగరాల్లో ఖర్చు అవుతుండగా, కోల్కతా, ఢిల్లీ, ముంబై నగరాలు ఉన్నాయి. ఆయా మెట్రో నగరాల్లో కనిష్ఠంగా రూ. 14వేల నుంచి రూ. 24వేల ఖర్చు చేస్తే తప్ప.. నెల గడిచే పరిస్థితి లేదని తేలింది. ఇక మెట్రోపాలిటన్ నగరాల్లో దొరికే ఉపాధి అవకాశాలతో ఎక్కువగా వలసొచ్చే నగరాల్లోనూ హైదరాబాద్ నగరానికి ప్రాధాన్యతనిస్తుండటం కూడా ఖర్చులపై ప్రభావం చూపుతుందంటున్నారు. ఆ తర్వాత బెంగళూరు నగరానికి వెళ్లేందుకు ప్రాధాన్యతనిస్తున్నారు. ఖర్చులు పెరగడానికి ప్రధాన కారణాల్లో విద్యా, ఇంటి అవసరాలకే ఎక్కువగా ఉన్నట్లుగా తేల్చారు. పిల్లలకు మంచి విద్యను అందించే క్రమంలో నెలవారీ బడ్జెట్ అంచనాలు తప్పుతున్నదని, విద్యా మరింత భారంగా మారుతుందని గుర్తించారు. చాలా మంది పిల్లల చదువులకే అధిక మొత్తం వెచ్చిస్తున్నట్లు వెల్లడైంది.