తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సుదూర ఆలోచనతో, వ్యూహాత్మక ప్రణాళికతో రూపకల్పన చేసిన మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం తన ఖాతాలో వేసుకునేందుకు సిద్ధమైంది. నగరాన్ని విశ్వ నగరంగా తీర్చిదిద్దే చర్యల్లో భాగంగా కేసీఆర్ ప్రభుత్వం రూ.52 కోట్లతో మూసీ నదిపై నిర్మించిన మూసారాంబాగ్ బ్రిడ్జిని నేడు సీఎం రేవంత్రెడ్డి రిబ్బన్ కట్ చేసి అందుబాటులోకి తేనున్నారు. వాస్తవానికి ఏడాది కిందటే అందుబాటులోకి రావాల్సిన ఈ వంతెన రెండున్నరేండ్ల సమయం తీసుకుని స్థానిక ప్రజలు కిలోమీటర్ల కొద్దీ చుట్టూ తిరిగి నరకయాతనకు కారణమైంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎట్టకేలకు ఈ బ్రిడ్జి అందుబాటులో రానుండడంతో అంబర్పేట-మలక్పేట మధ్య ప్రయాణ కష్టాలు తొలగి రాకపోకలు సులభతరం కానున్నాయి.
సిటీబ్యూరో/ మలక్పేట, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ) : మూసారాంబాగ్-అంబర్పేట మధ్య మూసీపై నిర్మిస్తున్న మూసారాంబాగ్ హై లెవెల్ బ్రిడ్జి నేడు ప్రారంభం కానున్నది. ఏటా వర్షాకాలంలో గండిపేట, ఉస్మాన్సాగర్, హుస్సేన్సాగర్ నుంచి నీటిని వదలడంతో నగరంలో వచ్చే వరదలతో మూసారాంబాగ్ బ్రిడ్జి వద్ద ఏర్పడే ముంపు సమస్యను శాశ్వతంగా పరిష్కారించాలన్న ఉద్దేశంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ వంతెన నిర్మాణానికి నిధులు కేటాయించి పనులు ప్రారంభించారు. 400 మీటర్ల పొడవునా వంద ఫీట్ల వెడల్పుతో ఆరు లేన్లుగా, రెండు బ్రిడ్జిలకు ఒకవైపు పది ఫీట్ల వెడల్పుతో ఫుట్పాత్ను నిర్మించాలని అప్పటి ప్రభుత్వం బ్రిడ్జి నిర్మాణానికి రూ.52 కోట్లు కేటాయించింది. నిర్మాణ పనులకు అప్పటి మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఏడాదిలోగా బ్రిడ్జి నిర్మాణం పూర్తిచేసి, వచ్చే వర్షాకాలంలో(2025లో) ముంపు సమస్య భారిన పడకుండా బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్ను ఆదేశించారు.

ఏడాదిలో పూర్తి కావాల్సిన బ్రిడ్జి..
అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం బ్రిడ్జి నిర్మాణంపై సరైన శ్రద్ధ్ద చూపకపోవడంతో నిర్మాణం చాలా ఆలస్యమైంది. రెండున్నరేళ్లుగా పనులు కొనసాగుతున్నా కేవలం ఒకవైపు వంతెన మాత్రమే పూర్తయింది. రూ. 52 కోట్లతో మూసీపై 220 మీటర్ల పొడవు, ఆరు లేన్లతో రెండు బ్రిడ్జీలతోపాటు అంబర్పేట వైపు 80 మీటర్లు, మూసారాంబాగ్ వైపు 80 మీటర్ల అప్రోచ్ రోడ్డు(ర్యాంప్)తోపాటు రెండు బ్రిడ్జిలకు ఒకవైపున ఎనిమిది ఫీట్ల వెడల్పు ఫుట్పాత్లతో రెండు వంతెనలుగా నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణ పనుల్లో ఒకవైపు వంతెన(తూర్పు భాగం) పనులు పూర్తయ్యాయి. అయితే రూ. 52 కోట్లలో రూ.37 కోట్లు బ్రిడ్జి నిర్మాణానికి, మరో రూ.15 కోట్ల రూపాయలు బ్రిడ్జి నిర్మాణంతో ఆస్తులు కోల్పోతున్న బాధితులకు నష్ట పరిహారం కింద చెల్లింపులకోసం కేటాయించారు. వంద ఫీట్ల వెడల్పుతో ఆరు లేన్లుగా నిర్మిస్తున్న రెండు వంతెనలలో తూర్పు భాగం వంతెన నిర్మాణం పూర్తయింది.
తప్పనున్న తిప్పలు..
రెండో వంతెన పూర్తవటానికి మరో మూడు, నాలుగు నెలల సమయం పట్టే అవకాశం ఉండటంతో ప్రస్తుతం పూర్తయిన బ్రిడ్జిపై నుంచే మూసారాంబాగ్-అంబర్పేట వైపు వాహనాల రాక పోకలు కొనసాగించాలని అధికారులు నిర్ణయించారు. బ్రిడ్జి నిర్మాణ పనుల ప్రారంభం నుంచి ఇప్పటివరకు మూసారాంబాగ్-అంబర్పేట వైపు వెళ్లే వాహనాలు గోల్నాక న్యూ బ్రిడ్జిపై మీదుగా ప్రయాణాలు కొనసాగిస్తున్నాయి. దీంతో దూరం పెరగడం, సమయం ఎక్కువగా పడుతుండడం, ఇరుకుగా ఉన్న బ్రిడ్జిపై నిత్యం ట్రాపిక్ సమస్యలు తలెత్తుతుండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ వంతెన ప్రారంభంతో మూసారాంబాగ్-అంబర్పేట వైపు వెళ్లే వాహనదారులకు ఇన్నాళ్లు పడ్డ తిప్పలు తప్పనుండగా, ప్రతియేట వచ్చే వరదలతో మూసారాంబాగ్ బ్రిడ్జివద్ద ఏర్పడే ముంపు సమస్య నుంచి కూడా ఉపశమనం లభించనుంది. అదేవిధంగా గోల్నాకనుంచి మూసారాంబాగ్ వైపు వచ్చే, పోయే వాహనాల రాకపోకలకు అనుగుణంగా బ్రిడ్జి పక్కన తూర్పు భాగం వైపు సర్వీస్ రోడ్డును కూడా నిర్మించారు.