పీర్జాదిగూడ/చర్లపల్లి ఏప్రిల్ 30: కరోనా బాధితులకు ఇచ్చే రెమిడెసివిర్ ఇంజక్షన్లను కొందరు బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో బ్లాక్లో అమ్ముతున్న ఐదుగురు వ్యక్తులను మేడిపల్లి, కుషాయిగూడ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి ఐదు ఇంజక్షన్లను స్వాధీనం చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
వారాసిగూడ, ఇందిరానగర్కాలనీకి చెందిన బెస్త రామచందర్ ల్యాబ్ టెక్నీషయన్. పీర్జాదిగూడలో ఉంటున్న కోమల కార్తీక్ మాస్కులు, శానిటైజర్లను మెడికల్ షాపులకు సరఫరా చేస్తుంటాడు. బోడుప్పల్ శ్రీనగర్కాలనీకి చెందిన అతిబాముల శ్రీనివాస్ మెడికల్ షాపును నిర్వహిస్తున్నాడు. ఈ ముగ్గురు కలిసి రెమిడెసివిర్ ఇంజక్షన్లను అధిక ధరలకు విక్రయిస్తున్నా రు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం బోడుప్పల్లోని శ్రీనివాస్ మెడికల్ షాపు వద్ద ఒక్కో ఇంజక్షన్ను రూ .25వేల చొప్పున తీసుకువచ్చి.. బాధితులకు రూ.35 వేలకు విక్రయిస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న మేడిపల్లి పోలీసులు ఆ ముగ్గురిని పట్టుకుని.. వారి నుంచి మూడు రెమిడెసివిర్ ఇంజక్షన్లను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు.
కాప్రా డివిజన్ పరిధిలోని ఓ ప్రైవేట్ వైద్యశాల లో అంబులెన్స్ డ్రైవర్గా పనిచేస్తున్న జవహర్నగర్ మున్సిపాలిటీ, బాలాజీ నగర్, లక్ష్మీనగర్కు చెందిన పబ్బోజి సాయికిరణ్, జ్యోతినగర్కు చెందిన గూడెం బాబురెడ్డిలు రెమిడెసివిర్ ఇంజక్షన్లను బ్లాక్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు.. శుక్రవారం కాప్రా డివిజన్లోని శ్రీరాంనగర్ కమాన్ వద్ద వారిద్దరిని కుషాయిగూడ ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకుని.. వారి నుంచి రెండు ఇంజక్షన్లను స్వాధీనం చేసుకున్నారు.