మణికొండ, సెప్టెంబర్ 26 : ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని పదేపదే చెబుతున్నా అదే నిర్లక్ష్య ధోరణిగా వ్యవహరిస్తున్న పనితీరు విస్మయాన్ని కల్గిస్తోంది… తీరు మారకపోతే మార్చాల్సిన పరిస్థితులు వస్తాయి… ఆరుమాసాలుగా డ్రైనేజీ పనులు మణికొండలో కొనసాగుతున్నాయంటూ ప్రజలు చెబుతున్నా ఆ మాటలను కప్పిపుచ్చేందుకు యత్నిస్తుండటమేమిటని ఇంజినీరింగ్ విభాగం డీఈ, ఏఈలపై రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రతీక్జైన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం మణికొండ మున్సిపాలిటీ గోల్డెన్ టెంపుల్ సమీపంలో డ్రైనేజీ కాలువ నిర్మాణానికి తవ్విన గుంతలో పడి వ్యక్తి గల్లంతు కావడంతో ఘటనా స్థలాన్ని ఆయన పరిశీలించారు.
అక్కడ జరిగిన తీరుతెన్నులపై విచారణ చేపట్టారు. స్పష్టంగా అధికారుల నిర్లక్ష్యమేనంటూ ప్రజలు అడిషనల్ కలెక్టర్ ముందే వాపోవడంతో ఆయన మండిపడ్డారు. నిర్ధేశించిన సమయంలో పనులు పూర్తిచేయని వ్యక్తులకు పనులను అప్పగించడమేమిటని.. ఇంతకు ఆ నిధులు వివరాలు ఎంత.. ఎన్ని మీటర్ల డయా..నిర్ధేశించిన పనుల గడువు వివరాల ఫైల్ ఎక్కడా అంటూ ఏఈ విఠోబాను ప్రశ్నించగా సమాధానం చెప్పకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకు మీరు విధులు నిర్వహిస్తున్నారా లేదా అంటూ ప్రశ్నించారు. అనంతరం డీఈ సాజిద్ను ప్రశ్నించిన సమాధానం లేకపోవడంతో పక్కనే ఉన్న కమిషనర్ జయ ంత్ను అడిగారు. అయినా సమాధానం లేకపోవడంతో అడిషనల్ కలెక్టర్ విస్మయం వ్యక్తంచేశారు.
మణికొండ, సెప్టెంబర్ 26 : రాత్రి కురిసిన భారీ వర్షానికి డ్రైనేజీ గుంతలో పడి వ్యక్తి గల్లంతైన సంఘటనా స్థలాన్ని కౌన్సిలర్లు ఆలస్య నవీన్కుమార్, కావ్యశ్రీరాములు, యాలాల లావణ్యనరేశ్తో కలిసి టీఆర్ఎస్ ఫ్లోర్లీడర్ రామకృష్ణారెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రజా సంక్షేమాభివృద్ధి కోసం ప్రభుత్వం మున్సిపాలిటీల అభివృద్ధికి కోట్లాది నిధులను కేటాయిస్తుందన్నారు. పనులు జరుగుతున్న చోట హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయలేకపోవడంతో వ్యక్తి గల్లంతయ్యాడన్నారు. నాయకులు శ్రీరాములు, మల్యాద్రినాయుడు, శ్రీకాంత్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.