సిటీబ్యూరో, మే 6 ( నమస్తే తెలంగాణ ) : కొవిడ్ను ఎదుర్కోవాలంటే రోగనిరోధక శక్తిని పెంచుకోవాలని ఎండోక్రినాలజిస్ట్ డాక్టర్ రవిశంకర్ ఇరుకలపాటి తెలిపారు. కొవిడ్ జాగ్రత్తలపై ఆయన గురువారం పలు సూచనలు ఇచ్చారు. కొవిడ్ సోకితే మరణిస్తున్నారనే వార్తలు బాధితుల్లో మరింత భయాన్ని కలిగిస్తున్నాయని, ఇలాంటి ఫేక్ వార్తలను విశ్వసించడం మంచిది కాదని తెలిపారు. డాక్టర్లు, సైంటిస్టుల సూచనలను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. ఊబకాయం, డయాబెటీస్ ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలన్నారు. క్రమం తప్పకుండా శ్వాస వ్యాయామం, వ్యాయామం చేయాలని చెప్పారు. తాజా పండ్లు, కూరగాయలు తినాలని, వైద్యుల సూచనలు లేకుండా విటమిన్ ట్యాబ్లెట్లు వాడకూదని తెలిపారు. ఆల్కహాల్ తీసుకోవడం వలన ఇమ్యూనిటీ తగ్గడంతో పాటు ఆరోగ్యం దెబ్బతింటుందని వివరించారు.