సిటీబ్యూరో, సెప్టెంబర్ 14(నమస్తే తెలంగాణ): సభ్య సమాజం తల దించుకునేలా ఆరేండ్ల చిన్నారిపై జరిగిన అత్యాకాండను ఛేదించేందుకు నగర పోలీసులు దృష్టి సారించారు. చిన్నారిని చిదిమేసిన నిందితున్ని పట్టుకునేందుకు మూడు కమిషనరేట్లలోని పోలీసులు రాష్ట్రం అంత టా జల్లెడ పడుతున్నారు. చిన్నారిపై లైంగిక దాడి చేసి హతమార్చిన కిరాతకుని కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. నిందితుడు పల్లకొండ రాజుకు సంబంధించి సమాచారం ఇస్తే రూ.10లక్షల రివార్డు ఇస్తామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ప్రకటించారు. సైదాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలోని సింగరేణి కాలనీలో నివాసముండే సభావత్ రాజు, జ్యోతి దంపతుల ఇంట్లో వినాయక చవితి రోజున విషాదం నెలకొంది. వాళ్ల ఆరేండ్ల పాపను పక్కింట్లో ఉండే పల్లకొండ రాజు అనే వ్యక్తి చిప్స్, చాక్లెట్లు ఇప్పిస్తానంటూ మాయ మాటలు చెప్పి ఆమెను తన ఇంట్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్ప డి దారుణంగా హత్య చేసిన ఘటన తెలిసిందే. ఈ కిరాతకుడిని పట్టుకోవడం కోసం హైదరాబాద్ కమిషనరేట్లోని అన్ని విభాగాల పోలీస్ బృందాలు రంగంలోకి దిగా యి. వీటితో పాటు రాచకొండ, సైబరాబాద్ పోలీసులు కూడా తమ వంతు సహకారాన్ని అందిస్తున్నారు. ఐదు రోజులుగా నిందితుడి కోసం వందల సంఖ్యలో పోలీసుల బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. ఇందుకు ప్రజల సహకారాన్ని సైతం పోలీసులు కోరుతున్నారు.
నిందితుడైన రాజు తాపీ మేస్త్రీల కింద నిర్మాణ పనులు చేస్తూ ఉంటాడు. ఇతని భార్య గొడవ పడి వెళ్లిపోయింది. మూడు నెలలుగా ఇంట్లో ఒంటరిగా ఉంటూ, అనుకున్నప్పుడు పని చేస్తూ, వచ్చిన డబ్బుతో మద్యం, గంజాయి తాగి జల్సా చేస్తున్నాడు. నిందితుడి స్వస్థలం యాదాద్రి జిల్లాలో ని అడ్డ గూడూర్ అక్కడ అతని తల్లి, సోదరి నివాసముంటారు. అప్పుడప్పుడు రాజు అక్కడకు వెళ్లి వస్తుంటాడు. ఘటన జరిగడానికి రెండు రోజుల ముందు నుంచే రాజు సెల్ఫోన్ను స్విచాఫ్లో ఉందని పోలీసులు గుర్తించారు. పనిచేసిన మేస్త్రీల వద్ద డబ్బులు తీసుకొని, అక్కడే వారితో కలిసి మందు తాగడం నిందితుడికి అలవాటు. ఈ క్రమంలోనే చివరగా ఎల్బీనగర్లో ఒక వ్యక్తి వద్ద పనిచేశాడు. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఉండటంతో అతడితో కలిసి 10వ తేదీన మద్యం సేవించాడు. అతని వద్ద రూ.1800 డబ్బు లు రావాల్సి ఉండగా, తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు పోలీసులు గుర్తించారు. ఘటన జరిగిన తరువాత ఎవరెవరిని నిందితుడు కలిశాడనే విషయంపై పోలీసులు ఆరా తీసి, వాళ్లందరి వద్ద నుంచి సమాచారం సేకరించారు. సైదాబాద్ నుంచి నిందితుడు ఎటువైపు వెళ్లాడని ఆరా తీసిన పోలీసులు సీసీ కెమెరాలను విశ్లేషించారు. లేబర్ అడ్డాలు, రైల్వే స్టేషన్లు, బస్టాపులు, బస్స్టాండ్లు, తాగుబోతుల అడ్డాలు ఇలా అన్ని ప్రాంతాలలో పోలీసు బృందాలు గాలింపు చేపట్టాయి.
నగరంలోని ట్రై పోలీస్ కమిషనరేట్ల పోలీసులతో పాటు నల్గొండ, వరంగల్, ఆదిలాబా ద్, సిరిసిల్ల తదితర జిల్లాల పోలీసులను కూ డా ఉన్నతాధికారులు అప్రమత్తం చేశారు. నిందితుడు పోలీసులకు దొరకకుండా ఉం డేందుకు గుండు గీయించుకునే అవకాశాలు కూడా లేకపోలేదని పోలీసులు అనుమానిస్తూ ఆ దిశగా దర్యాప్తు జరుపుతున్నారు. రెండ్రోజులుగా పోలీసులు ఉస్మానియా, గాంధీ దవాఖానాల మార్చురీలలో గుర్తు తెలియని మృతదేహాలపై ఆరా తీశారు. నిందితుడి చేతులకు మౌనిక పేరుతో ట్యాటూలు ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. కేసు దర్యాప్తు పురోగతి కోసం నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ఆధ్వర్యంలో ఉన్నతాధికారులు అదనపు సీపీ శిఖా గోయెల్, ఈస్ట్ జోన్ జాయింట్ సీపీ రమేశ్, టాస్క్ఫోర్స్ డీసీపీలు, అధికారులు ఎప్పకటిప్పుడు పరిశీలిస్తున్నారు. డీజీపీ సైతం ఈ కేసు దర్యాప్తు పురోగతిపై ప్రత్యేక దృష్టి సారించారు.
మూడు రోజులైనా నిందితుడు పట్టుబడకపోవడంతో సీపీ అంజనీ కుమార్ మంగళవారం సాయంత్రం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. నిందితుడి ఆచూకీ చెప్పిన వాళ్లకు రూ.10 లక్షల రివార్డును ఇస్తామని ప్రకటించారు. ఆరేండ్ల బాలికను రేప్ చేసి మర్డర్ చేసిన కేసులో పల్లకొండ రాజుపై సైదాబాద్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. నిందితుడికి సంబంధించిన సమాచారం, ఏదైనా ఆధారం చెబితే అది నిందితుడిని పట్టించే విధంగా ఉంటే రూ.10 లక్షలు రివార్డుగా అందిస్తామని సీపీ ప్రకటన విడుదల చేశారు. నిందితుడి వయస్సు 30 సంవత్సరాలు, ఎత్తు 5.9 అడుగులు, పెద్ద ఎంట్రుకలు, ఆ జుట్లుకు రబ్బర్ బ్యాండ్ వేసుకొని ఉంటాడు. నెత్తిన టోపి పెట్టుకొని ఎర్రటి స్క్రాప్ మెడకు చుట్టుకొని ఉంటాడని సీపీ నిందితుడి వివరాలు వెల్లడించారు. నిందితుడి రెండు చేతులపై ‘మౌనిక’ అనే పేరును పచ్చబొట్టు (ట్యాటూ) వేయించుకొని ఉంటాడని, సన్నటి గడ్డం(పిల్లి గడ్డం)తో సాధారణ ప్యాంట్, అంగీ వేసుకొని ఉంటాడని సీపీ తెలిపారు. మద్యం తాగి, ఫుట్పాత్లు, బస్టాండ్లలో నిద్ర పోతుంటాడని వివరించారు. ఇతడి ఆచూకీ తెలిసిన వారు ఈస్ట్జోన్ డీసీపీ(94906 16366), టాస్క్ఫోర్స్ డీసీపీ(94906 16627)కు ఫోన్ చేయాలని సీపీ కోరారు.