తెలుగు యూనివర్సిటీ, జూలై 29: భారతీయ శాస్త్రీయ సంగీతం, నృత్యాంశాల పట్ల ఆసక్తి ఉన్న యువ కళాకారులను ప్రోత్సహించాలని చిలుకూరు బాలాజీ దేవస్థానం ప్రధాన అర్చకులు రంగరాజన్ సూచించారు. సరస్వతి సంగీత నృత్య శిక్షణాలయం 21వ వార్షిక వేడుకలు భారతీయ విద్యాభవన్ ఆడిటోరియంలో శనివారం సాయంత్రం జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆద్యంతం ఆహూతులను సంగీత ప్రపంచంలో ఓలలాడించాయి. శిక్షణాలయం వ్యవస్థాపకురాలు ప్రతిమ శశిధర్ ఆధ్వర్యంలో ఔత్సాహిక కళాకారులు వీణా వాద్య కచేరి, భరత నాట్యం, వయోలిన్, గాత్రం, కీబోర్డుపై వాగ్గేయకారుల కృతులను ఆలపించి ఆహూతుల ప్రశంసలు అందుకున్నారు. ఈ సందర్భంగా సంగీత నాట్య రంగాలకు విశేష సేవలందించిన గురువులు జొన్నల గడ్డ ఈశ్వరప్రసాద్, చిద్రూప లక్ష్మి దంపతులకు ఆత్మీయ సత్కారం చేశారు. భారతీయ కళా సంస్కృతిని భావితరాలకు అందిస్తున్న గురువు ప్రతిమ కృషిని వక్తలు ప్రశంసించారు.