మేడ్చల్ కలెక్టరేట్, అక్టోబర్ 20 : జిల్లాలో మొదటి విడత ఎన్నికల కంట్రోల్ యూనిట్లు, బ్యాలెట్ యూనిట్లు, వీవీ ప్యాట్ల ర్యాండమైజేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ గౌతమ్, అదనపు కలెక్టర్లు విజయేందర్ రెడ్డి, అభిషేక్ అగస్త్య, డీఆర్వో హరిప్రియ, రిట్నరింగ్ అధికారులు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో జిల్లాలోని 5 నియోజకవర్గాలకు సంబంధించి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ ప్రక్రియను పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా 5 నియోజకవర్గాల్లో పోలింగ్ స్టేషన్లు 2397కు బ్యాలెట్ యూనిట్లను 25 శాతం ర్యాండమైజేషన్ చేయగా ప్రక్రియ తర్వాత 2997 అయ్యాయి. అలాగే కంట్రోల్ యూనిట్లు 2397 ఉండగా ప్రక్రియ తర్వాత 2997 అయ్యాయి. వీవీ ప్యాట్లు 2397కు గాను 40 శాతం ర్యాండమైజేషన్ చేయగా 3356కు పెరిగాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ వివరించారు. గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ప్రతినిధులకు ఎన్నికల సామగ్రి, కౌంటింగ్, స్ట్రాంగ్రూం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. అంతకు ముందు కలెక్టరేట్ ఆవరణలోని ఈవీఎం గోడౌన్లకు గుర్తింపు పొందిన రాజకీయ నాయకులను అధికారులు తీసుకెళ్లి, అవగాహన కల్పించారు.
జిల్లాలోని 15 నియోజకవర్గాలకు సంబంధించిన ఎన్నికల నిర్వహణను సమగ్రంగా నిర్వహిస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ తెలిపారు. శుక్రవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూంలో ఎన్నికల్లో వినియోగించే ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్, వీవీప్యాట్ల మొదటి ర్యాండమైజేషన్ను రాజకీయ పార్టీల ప్రతినిధులు, డిప్యూటీ డీఈఓ అనుదీప్ దురిశెట్టి సమక్షంలో జిల్లా ఎన్నికల అధికారి పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ శంకరయ్య, జాయింట్ కమిషనర్ మంగతాయారు, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.