ముగిసిన ఉపవాస దీక్షలు
నేడు ఈద్-ఉల్-ఫితర్
ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యే వెంకటేశ్
గోల్నాక, మే 2 : ఉపవాస దీక్షలతో ముస్లింలంతా నెల రోజుల పాటు గడిపారు. నెల వంక సాక్షాత్కరించిందని మత పెద్దల ప్రకటన వెలువడింది. దీంతో రంజాన్ సందడి మొదలైంది.. నేడు ఈద్గాలలో జరుగనున్న ప్రత్యేక పండుగ ప్రార్థనల కోసం ముస్లింలంతా సిద్ధమవుతున్నారు.
నేడు సామూహిక ప్రార్థనలు..
రంజాన్ పండుగను మంగళవారం ముస్లింలు జరుపుకోనున్నా రు. పండుగ సందర్భంగా ఈద్గాల వద్ద ముస్లింలు సామూహిక ప్రార్థనలు చేస్తారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లింల పవిత్రగ్రంథమైన ఖురాన్ ఈ నెలలోనే పుట్టింది. అందుకే రంజాన్ నెలను ముస్లింలు భక్తి శ్రద్ధలతో జరుపుతారు. అంబర్పేట నియోజకవర్గం లోని అంబర్పేట, బాగ్అంబర్పేట, గోల్నాక, కాచిగూడ, నల్లకుంట తదితర డివిజన్లలతో పాటు ముస్లింలున్న పలు ప్రాంతాల్లో రంజాన్ సందడి మొదలైంది..
ఈద్గాల్లో ఏర్పాట్లు పూర్తి ..
మంగళవారం జరిగే ప్రార్థనల కోసం అంబర్పేట మున్సిపల్ మైదానం ఈద్గాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ఏర్పాట్లను సోమవారం ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ పరిశీలించారు. తాగు నీటి వసతితో పాటు అన్ని వసుతులతో మైదాన ప్రాంతాన్ని శుభ్రంగా తీర్చిదిద్దారు. నియోజకవర్గంలోనే అతిపెద్దదైన అంబర్పేట మైదానంలో ఒకే సారి వేలాది మంది ముస్లింలు ప్రార్థనలు నిర్వహిస్తారు. దీంతో పాటు గోల్నాక డివిజన్లోని నెహ్రూనగర్ జీహెచ్ఎంసీ మైదానంలో కూడా రంజాన్ ప్రార్థనలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.