సిటీబ్యూరో, జనవరి 19 (నమస్తే తెలంగాణ): యూసుఫ్గూడకు చెందిన రామ్మోహన్ పట్నాయక్ విశ్రాంత బ్యాంక్ ఉద్యోగి. ఎస్బీఐ క్రెడిట్ కార్డును కలిగి ఉన్నాడు. అయితే, అతడికి తెలియకుండానే రూ.20వేలు క్రెడిట్ కార్డు ద్వారా వినియోగించినట్లు మెస్సేజ్ వచ్చింది. వెంటనే సంబంధిత ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్స్ సర్వీసెస్ లిమిటెడ్కు సమాచారం ఇవ్వడంతో.. క్రెడిట్ కార్డును బ్లాక్ చేశారు. దీనిపై వ్యతిరేక పక్షాలు బాధ్యత తీసుకోకపోవడంతో పాటు ఎలాంటి విచారణ చేపట్టకుండా, మోసపూరితంగా డ్రా అయిన మొత్తానికి అదనంగా పెనాల్టీ చార్జీలే కాకుండా నెలవారీ వడ్డీ (క్రెడిట్ కార్డు డ్యూ) పేరుతో రూ.33,083 చెల్లించాలని వినియోగదారుడికి లెటర్ ద్వారా సమాచారమిచ్చారు. మోసపూరితంగా జరిగిన లావాదేవీ అంశాన్ని విచారించాలని, తిరిగి తన క్రెడిట్ కార్డును పునరుద్ధరించాలని బాధితుడు వ్యతిరేక పక్షాలకు సమాధానంగా లెటర్ రాశాడు. స్పందన రాకపోవడంతో న్యాయం కోరుతూ వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించారు. వినియోగదారుడు, వ్యతిరేకపక్షాల వాదనలను హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-1 అధ్యక్షురాలు బి.ఉమా వెంకటసుబ్బలక్ష్మి, సభ్యులు సి.లక్ష్మీప్రసన్న, శాసనకోట మాధవిలతో కూడిన బెంచ్ పరిశీలించింది. క్రెడిట్ కార్డుపై అదనపు చార్జీలు, వడ్డీని రద్దు చేయాలని ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్స్ సర్వీసెస్ లిమిటెడ్కు ఆదేశాలు జారీ చేసింది. వినియోగదారుడికి రూ.20 వేలు నష్టపరిహారంగా చెల్లించడంతోపాటు రూ.10వేలు కోర్టు ఖర్చుల కింద అందజేయాలని హైదరాబాద్, హర్యానాలోని సంస్థలకు సూచించింది.