దుండిగల్,ఏప్రిల్ 6: నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి, ప్రగతినగర్లోని వీఎన్ఆర్ విజ్ఞానజ్యోతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(వీఎన్ఆర్ వీజేఐఈటీ)కళాశాలలో గతమూడు రోజులుగా ‘సిన్టిలేషన్స్-2023’ పేరుతో నిర్వహిస్తున్న సాంస్కృతికోత్సవాలు ముగిసాయి. గురువారం జరిగిన ముగింపు వేడుకలకు సినీ నటుడు గోపీచంద్, హీరోయిన్ డింపుల్హయతీతో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు జంటగా నటిస్తున్న ‘రామబాణం’ చిత్రంలోని ‘ఐ ఫోన్ సేతిల పట్టి’ అనే పాటను విద్యార్థుల సమక్షంలో విడుదల చేసి.. వారితో కలిసి స్టెప్పులు వేసి అలరించారు. అదే విధంగా లైఫ్ ఈజ్ బ్యూటీపుల్ సినిమా ఫేం సుధాకర్ కోమాకుల తమ చిత్రం ‘నారాయణ అండ్ కో’ టీజర్, పాటలను ప్రదర్శించారు. ఎలక్ట్రానిక్ డ్యాన్స్ మ్యూజిక్ షో(ఈడీఏం) విద్యార్థులను ఉర్రూతలూగించింది. ఈ వేడుకల్లో రామబాణం చిత్ర దర్శకుడు శ్రీవాస్, డా. సీడీ నాయుడు, కళాశాల సంచాలకులు బి.చెన్నకేశవరావు, ప్రొఫెసర్ పద్మసాయి పాల్గొన్నారు.