బండ్లగూడ, జూలై 18: గాజుల వ్యాపారం ముసుగులో గంజాయి రవాణా చేస్తున్న ముఠాను రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు. ఈ కేసు వివరాలను రాజేంద్రనగర్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి వెల్లడించారు. మహారాష్ట్రకు చెందిన యశోద గంజాయి వ్యాపారి. ఆంధ్రప్రదేశ్కు చెందిన అశోక్, శివాజీ, సల్మాబేగం, స్వప్న, అప్ప గులాబితో మహారాష్ట్రకు గంజాయి రవాణా చేసేందుకు ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు నిందితులు ఎవరికీ అనుమానం రాకుండా బ్యాగులలో గాజులను పేర్చి.. వాటి కింద గంజాయి పెట్టి.. తరలించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. హైదరాబాద్ మీదుగా ఆంధ్రప్రదేశ్ నుంచి మహారాష్ట్ర బయలుదేరారు.
మైలార్దేవ్పల్లి మీదుగా వెళ్తున్న వీరి సమాచారం రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులకు అందింది. దీంతో ఎస్ఓటీ పోలీసులు మైలార్దేవ్పల్లిలో వారిని పట్టుకొని, బ్యాగులను పరిశీలించారు. బ్యాగుల్లో గాజులను నింపి.. వాటి కింద గంజాయిని పెట్టి తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వారి వద్ద నుంచి 80 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విలువ రూ.16 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. పోలీసుల విచారణలో.. మహారాష్ట్రకు చెందిన యశోద సూచన మేరకు గంజాయి తరలిస్తున్నట్లు నిందితులు తెలిపారు. ఈ కేసులో ఐదుగురిని అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు. యశోద కోసం గాలిస్తున్నట్లు డీసీపీ తెలిపారు.