సిటీబ్యూరో, జూన్ 12 (నమస్తే తెలంగాణ): పశ్చిమ దిశ నుంచి తెలంగాణ వైపునకు వీస్తున్న దిగువ స్థాయి గాలుల ప్రభావంతో గ్రేటర్లో ఎండల తీవ్రత కొనసాగుతున్నది. దీంతో సిటీలో పగటి ఉష్ణోగ్రతలు 37-39 డిగ్రీల మధ్య నమోదవుతున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. అధిక ఉష్ణోగ్రతల వల్ల క్యుములో నింబస్ మేఘాలు ఏర్పడి రాగల రెండు రోజులు సాయంత్రం లేదా రాత్రి సమయాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం రుతుపవనాలు పొరుగు రాష్ట్రమైన ఏపీలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించాయని, రెండు మూడు రోజుల్లో తెలంగాణకు విస్తరించే అవకాశముందని పేర్కొన్నారు. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠం 38.8, కనిష్ఠం 26.5 డిగ్రీలు, గాలిలో తేమ 31 శాతంగా నమోదైనట్లు తెలిపారు.