సిటీబ్యూరో, జనవరి 13 (నమస్తే తెలంగాణ) : సంక్రాంతి పండుగ సందర్భంగా పట్నం నుంచి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో రైల్వే స్టేషన్లు, బస్స్టాండ్లన్నీ కిటకిటలాడుతున్నాయి. అయితే ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని వారికి ఇబ్బందులు కలుగకుండా ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండానే టీఎస్ ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు.
కాగా, ప్రయాణికుల తాకిడి పెరిగినప్పటికీ, తగిన సౌకర్యాలు కల్పించడంలో రైల్వే శాఖ ఘోరంగా వైఫల్యం చెందిందంటూ ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణికులకు అనుగుణంగా రైళ్లు ఏర్పాటు చేయకపోవడంతో దొరికిన రైళ్లలోనే ప్రయాణికులు ఎక్కుతున్నారు. దీంతో రైళ్లలో కాలు మోపే సందు లేకుండా పోవడంతో వృద్ధులతో పాటు పిల్లలు, మహిళలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికైనా రైల్వే అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలంటున్నారు.