మైలార్దేవ్పల్లి, మే 7 : కాటేదాన్ పారిశ్రామిక వాడలో కల్తీ పదార్థాల తయారీ కేంద్రాలపై రాజేంద్రనగర్ ఎస్వోటీ పోలీసులు ఆదివారం దాడులు జరిపారు. మైలార్దేవ్పల్లి డివిజన్ పరిధిలోని కాటేదాన్ శాంతినగర్లో ఓ పరిశ్రమలో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్టు, మ్యాంగో కూల్ డ్రింక్ తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు. కుల్లిపోయిన అల్లం వెల్లుల్లికి ఘాటుగా ఉండడానికి ఆసిటిక్ యాసిడ్తో పాటు ప్రమాదకరమైన రసాయనాలు కలుపుతున్నారు. ఈ పేస్టులో అల్లం, వెల్లుల్లి పొట్టును సైతం కలుపుతున్నారు. మరో పక్క అపరిశుభ్రమైన నీటితో పరిశ్రమలో చిన్నారులు ఇష్టపడే మ్యాంగో జ్యూస్ను తయారు చేస్తున్నారు. 500 కేజీల అల్లం వెల్లుల్లి పేస్టు, నాన్ వెజ్ మసాల ప్యాకెట్స్ 550 కేజీలు, మ్యాంగో కూల్ డ్రింక్లు, రసాయనాలు, 210 లీటర్ల ఆసిటిక్ యాసిడ్ , 1000 కేజీల వెల్లుల్లిని సీజ్ చేశారు. నిర్వాహకులు ఫిరోజ్ అలీ, అజీత్ను అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.