సిటీబ్యూరో, జనవరి 10 (నమస్తే తెలంగాణ)/మన్సూరాబాద్: స్నాచింగ్లు, రోడ్డు ప్రమాదాలు తగ్గించడంలో భాగంగా ఈ నెల 2 నుంచి 9వ తేదీ వరకు డ్రంక్ అండ్ డ్రైవ్, నంబర్ ప్లేట్ లేని వాహనాలు, ఫుట్పాత్ల ఆక్రమణలకు సంబంధించిన అంశాలపై రాచకొండ కమిషనరేట్ పరిధిలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించినట్లు ట్రాఫిక్ డీసీపీ డి.శ్రీనివాస్ మంగళవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ ఆదేశాలతో చేపట్టిన ఈ డ్రైవ్లో నంబర్ ప్లేట్ లేని, నంబర్ ప్లేట్ సరిగాలేని 2,925 వాహనాలపై కేసులు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. అలాగే, ఫుట్పాత్ ఆక్రమణలకు సంబంధించిన అంశంలో 28 మంది వ్యాపారులకు, ఆక్రమణదారులకు నోటీసులు, కొందరిపై కేసులు నమోదు చేసినట్లు వివరించారు.
హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపే వారిపై 27,467, సెల్ఫోన్ డ్రైవింగ్ 87, ట్రిపుల్ రైడింగ్ 441 కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్లో 664 మందిపై కేసులు నమోదయ్యాయని తెలిపారు. కాగా, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులకు సంబంధించి 992 మందిని కోర్టులో హాజరుపర్చగా.. 26 మందికి ఒకటి నుంచి ఐదు రోజుల జైలు, 20 మందికి ఒకటి నుంచి 5 రోజులు సామాజిక సేవ చేయాలని కోర్టు శిక్ష విధించిందని తెలిపారు. ఈ సమావేశంలో ఎల్బీనగర్, మల్కాజిగిరి, భువనగిరి జోన్ల ట్రాఫిక్ ఏసీపీలు అంజయ్య, శ్రీనివాస్, సైదులు పాల్గొన్నారు.