సిటీబ్యూరో, జూలై 16(నమస్తే తెలంగాణ): రాచకొండలో భోగినీ మండపంలోని రాతి గుండుపై 600 ఏండ్ల కిందట వేసిన సింగ భూపాలుని చిత్రం వెలుగు జూసింది. ఇది తెలంగాణ పూర్వ చరిత్రకు అరుదైన నిదర్శనమని చరిత్రకారుడు డాక్టర్ ద్యావనపల్లి సత్యనారాయణ శుక్రవారం ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు. ఇటీవల రాచకొండ వద్ద తాము జరిపిన పరిశోధనలో ఈ అరుదైన చిత్రాన్ని గుర్తించినట్లు ఆయన పేర్కొన్నారు. భోగినీ నాట్య మండపం, సింగ భూపాలుని చిత్రాల గుర్తింపు, పూర్వ చరిత్ర, పరిశోధనలో గుర్తించిన పలు అంశాలు ఆయన మాటల్లోనే., ప్రభువుల నుంచి సామా న్య ప్రజల వరకు అందరినీ ఆకట్టుకునేది నాట్యకళ.
పూర్వ కాలంలో నాట్య కళలో నిష్ణాతులైన వారు తమ నృ త్యంతో అందరినీ అలరించేవారు. అందుకు గాను 600 ఏండ్ల కిందట సర్వజ్ఞ సింగ భూపాలుడు అనే రాజు భోగినులను పోషించడమే కాకుండా, ఆమె కొరకు రాచకొండలో నాట్య మండపం కట్టించి అందులో ఆమె చేత నాట్య ప్రదర్శనలిప్పించారు. ఇప్పుడున్న భోగినీ మండ పం వెనుక భాగంలో పద్మనాయక రాజుల బిరుదు గద్యంలో పేర్కొన్నట్లు సింగ భూపాలుడు అశ్వరూరుడై విహరిస్తున్నట్లు రేఖా చిత్రముంది. బహుశా దాన్ని భోగినియే చెక్కించి ఉంటుందని భావన. సింగభూపాలుడు నాట్య విద్యను అధ్యయనం చేసి “రసార్ణవ సుధాకరం” అనే సులభ గ్రాహ్య నాట్య అలంకార శాస్త్ర గ్రంథాన్ని సంస్కృతంలో రచించాడు.
ఆ గ్రంథంలో భాగంగా లక్ష్య గ్రంథమైన ‘రత్న పాంచాలిక’ అనే నాటకాన్ని రచించాడు. సింగ భూపాలుడు తన రచనలో అంతకు ముందు అలంకారికులు వేశ్యను నాయికకు పనికి రాని సామాన్య స్త్రీ అని రాస్తే, ఆయన తన నాటకంలో దేవుడు నాయకుడైనప్పుడు అతడిని వరించే భోగిని నాయికార్హత పొందుతుందని చెప్పారు. అంతే కాకుండా తన రత్న పాంచాలిక నాటకంలో కువలయావళి అనే భోగిని కృష్ణుడిని వరించి పెళ్లాడిన నాయికగా చిత్రించారు. కాకతీయులు గాని, వారి ముందు, వెనుక రాజులు గాని ప్రత్యేకంగా నాట్యశాలలు కట్టించినట్లు సాహిత్య ఆధారాలు, పురావస్తు ఆధారాలు గానీ ఇప్పటి వరకు లభించలేదు. ఇక్కడి రాచకొండ సింగ భూపాలుడు ప్రత్యేకంగా నాట్య మండపాన్ని నిర్మించడం మన పూర్వ చరిత్రకు నిదర్శనమని ద్యావనపల్లి సత్యనారాయణ వివరించారు.