సిటీబ్యూరో, జూన్ 22 (నమస్తే తెలంగాణ): యూపీలో నీవు చదివిన స్కూల్లోనే నేను చదివాను.. అంటూ ఫేస్బుక్లో పరిచయమై.. ఇన్స్టాగ్రామ్లో ఫొటోలు షేర్చేసి ఆ తరువాత బ్లాక్మెయిలింగ్ చేస్తున్న యూపీ వాసిని రాచకొండ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సైబర్ క్రైమ్స్ డీసీపీ అనురాధ కథనం ప్రకారం.. నాగారానికి చెందిన బాధితురాలు యూపీలోని బరెల్లీలో స్కూల్లో విద్య పూర్తి చేసింది. 2018లో ఆర్యాన్ ఖుష్ అనే వ్యక్తి నుంచి ఆమెకు ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. నేను మీ స్కూల్లో సీనియర్నంటూ చెప్పుకున్నాడు. దీంతో ఆమె ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసింది. అనంతరం స్క్రీన్ షేరింగ్ యాప్ను డౌన్లోడ్ చేసి, ఆమె ఫోన్లోని ఇన్స్టాగ్రామ్ పోస్టులు కూడా చూసే వరకు వెళ్లి వారిద్దరూ మంచి స్నేహితులుగా మారారు. ఆ తరువాత ఆమె వ్యక్తి గత ఫొటోలు అడిగాడు. దీంతో బాధితురాలు అతడికి దూరంగా ఉండటం ప్రారంభించింది. దీంతో నిందితుడు ఆమెను బెదిరిస్తూ తనకు తానుగా హాని చేసుకుంటానంటూ బ్లాక్మెయిల్ చేయడంతో అతడి ఐడీని బ్లాక్ చేసింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి బెదిరించడం, తన వద్ద ఆమె వ్యక్తిగత ఫొటోలున్నాయని.. వాటిని ఇతరులకు షేర్ చేస్తానంటూ హెచ్చరించాడు. అంతటితో ఆగకుండా ఆమె వ్యక్తిగత ఫొటోలు ఆమె తల్లి, సోదరుడికి పంపించాడు. తాను చెప్పినట్లు వినకపోతే మీ బంధువులందరికీ వాటిని పంపిస్తానంటూ బ్లాక్మెయిల్ చేయడంతో బాధితురాలు రాచకొండ సైబర్క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది.
ఏసీపీ వెంకటేశం పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ నరేందర్గౌడ్ నేతృత్వంలోని బృందం కేసు దర్యాప్తును ప్రారంభించింది. నిందితుడు ఉత్తరప్రదేశ్కు చెందినవాడిగా గుర్తించి, ఓ ప్రత్యేక బృందం యూపీలోని సహజాన్పూర్కు వెళ్లింది. అక్కడ నిందితుడు మెహిత్ ప్రతాప్ కుశ్వాన్ను గుర్తించి అరెస్ట్ చేసి నగరానికి తీసుకొచ్చారు. బాధితురాలి ప్రొఫైల్ను చూసిన నిందితుడు.. తాను కూడా మీ స్కూల్ మాజీ విద్యార్థినంటూ పరిచయమయ్యాడు. యూట్యాబ్లో ఫిషింగ్ లింక్లతో ఇతరుల మొబైల్ను ఎలా యాక్సెస్ చేయాలనే విధానాన్ని నేర్చుకున్నాడు. ఇందులో భాగంగా బాధితురాలు ఫ్రెండ్గా మారిన తరువాత ఆమెకు ఒక ఫిషింగ్ లింక్ను పంపించాడు. అక్కడ తన ఇన్స్టాగ్రామ్ పోస్టులు ఫాలో కావాలంటే ఈ లింక్ను క్లిక్ చేయాలని చెప్పాడు. నమ్మిన బాధితురాలు ఆ లింక్ను క్లిక్ చేసింది. లింక్ క్లిక్ చేయడంతో బాధితురాలి ఫోన్ను నిందితుడు యాక్సెస్ చేసేందుకు వీలు కలిగింది. ఆ ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్, ఫొటోలు సేకరించాడు. ఆ తరువాత ఆమెను బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించాడు. ఈ విషయాన్ని గుర్తించిన బాధితురాలు అతడిని దూరంగా పెట్టడంతో తన చేతిని కట్ చేసుకొని బ్లాక్మెయిల్ చేయాలనుకున్నాడు. అయితే, బాధితురాలు పూర్తిగా అతడి నంబర్ను, ఐడీలను బ్లాక్ చేయడంతో తన విశ్వరూపాన్ని చూపడం ప్రారంభించాడు. దీంతో ఆమె కుటుంబ సభ్యులకు చెందిన ఫోన్ నంబర్లకు బాధితురాలి మార్ఫింగ్ ఫొటోలు పంపిస్తూ బ్లాక్మెయిల్ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో నిందితుడిని అరెస్ట్ చేసి, న్యాయస్థానంలో హాజరుపరిచారు.