హైదరాబాద్ : ఈ నెల 18వ తేదీన ఉప్పల్ స్టేడియం వేదికగా భారత్ – న్యూజిలాండ్ జట్ల మధ్య వన్డే మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం ఉప్పల్ స్టేడియంను రాచకొండ సీపీ దేవేంద్ర సింగ్ చౌహాన్ పరిశీలించారు. క్రికెట్ మ్యాచ్ దృష్ట్యా పోలీసు భద్రతపై సమీక్షించారు. ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ పలు అంశాలపై అధికారులతో చర్చించిన సీపీ చౌహాన్.. పలు సూచనలు చేశారు.
ఈ నెల 18న ప్రారంభం కాబోయే మొదటి వన్డే మ్యాచ్కు హైదరాబాద్లోని రాజీవ్గాందీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. ఇక రెండో మ్యాచ్ 21న రాయ్పూర్లో, మూడో వన్డే 24న ఇండోర్ స్టేడియంలో జరగనున్నాయి. టీ20 సిరీస్ 27న రాంచీ, 29న లక్నో, ఫిబ్రవరి 1న అహ్మదాబాద్ వేదికగా జరుగనున్నాయి. ఇక హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో దాదాపు నాలుగేళ్ల తర్వాత మ్యాచ్ జరుగనున్నది. చివరి వన్డే మ్యాచ్ 2019, మార్చి 2న భారత్ – ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగింది.
ఇందుకు సంబంధించి టిక్కెట్లన్నీ ఆన్లైన్లో అందరికీ అందుబాటులో ఉంచుతున్నట్లు హెచ్సీఏ ప్రకటించింది. భారత్, కివీస్ వన్డే మ్యాచ్ టిక్కెట్లు ఆఫ్లైన్లో విక్రయించడం లేదు. కేవలం పేటీఎమ్ ద్వారా ఆన్లైన్లో అందుబాటులో ఉంచారు. దాదాపు నాలుగేండ్ల తర్వాత హైదరాబాద్లో వన్డే మ్యాచ్ జరుగుతుంది. ఇందుకోసం అభిమానులకు ఎక్కడా ఇబ్బంది కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆన్లైన్లో ఈ నెల 13 నుంచి 16 వరకు టిక్కెట్లు అమ్ముతారు. ఎల్బీ స్టేడియం, గచ్చిబౌలి స్టేడియాల్లో 15వ తేదీ నుంచి 18 వరకు ఆన్లైన్లో బుక్ చేసుకున్న వారు ఇక్కడ టిక్కెట్లు తీసుకోవాల్సి ఉంటుంది. స్టేడియం మొత్తం సామర్థ్యం 39, 112 కాగా 29, 417 టిక్కెట్లు అమ్మకానికి ఉంచుతున్నారు.