సిటీబ్యూరో, మార్చి 6 (నమస్తే తెలంగాణ): హోలీ పండుగ, కాముని దహనంతో పాటు ముస్లింలు జరుపుకొనే షబ్-ఏ-బరాత్ సందర్భంగా తీసుకోవాల్సిన బందోబస్తు జాగ్రత్తలపై సిబ్బందికి రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహాన్ పలు సూచనలు చేశారు. సోమవారం నేరెడ్మెట్లోని కమిషనరేట్ కార్యాలయంలో రాచకొండ పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రజలు శాంతియుతంగా, సంతోషంగా హోలీ పండుగ జరుపుకోవాలని, అనారోగ్యంతో బాధపడుతున్న వారి మీద హానికర రంగులు చల్లవద్దని సూచించారు.
6వ తేదీ సాయంత్రం నుంచి 8వ తేదీ ఉదయం వరకు మద్యం దుకాణాలు బంద్ చేయాలని ఆదేశాలిచ్చామని, నిబంధనలు ఉల్లంఘించి మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో మల్కాజిగిరి డీసీపీ గిరి ధరావత్ జానకి, ఎస్వోటీ డీసీపీలు మురళీధర్, గిరిధర్, అదనపు డీసీపీ శివరాం శర్మ, ఏసీపీ జావెద్ తదితర అధికారులు పాల్గొన్నారు.