బంజారాహిల్స్, ఫిబ్రవరి 19: యూసుఫ్గూడ సమీపంలోని ఎల్ఎన్నగర్లో జరిగిన పుట్టా రాము హత్య కేసులో మరో ఏడుగురు నిందితులను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ సమీపంలోని సింగోటం గ్రామానికి చెందిన పుట్టా రాము ముదిరాజ్ అలియాస్ సింగోటం రామన్న (36) ఈ నెల 7న ఎల్ఎన్నగర్లో నివాసముంటున్న హిమాంబీ అలియాస్ హసీనా ఇంట్లో దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే.
షాపూర్నగర్ సమీపంలోని రాంరెడ్డినగర్కు చెందిన మణికంఠ అలియాస్ మణి అనే జువ్వా నిర్వాహకుడు, బోరబండ ప్రాంతానికి చెందిన రౌడీషీటర్ మహ్మద్ జిలానీ పాషా, వినోద్, ఎల్ఎన్నగర్కు చెందిన వ్యభిచార గృహ నిర్వాహకురాలు హిమాంబీ అలియాస్ హసీనా, ఆమె కూతురు నసీమా కలిసి పుట్టా రాము హత్యకు ప్లాన్ వేసి, అత్యంత కిరాతంగా చంపినట్లు పోలీసుల విచారణలో వెల్లడయ్యింది.
హత్య జరిగిన మూడు రోజుల తర్వాత ప్రధాన నిందితుడు మణికంఠ, వినోద్, హిమాంబీ, నసీమాతో సహా 8 మంది నిందితులను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు. కాగా, పరారీలో ఉన్న రౌడీషీటర్ జిలానీ పాషా, అతడి సోదరుడు మహ్మద్ ఫరూక్ (30), మహ్మద్ ఫిరోజ్ ఖాన్ (32), షేక్ యూనిస్(23), దుర్గం కమలాకర్ అలియాస్ లఖన్ (34), ముత్యాల గణపతి (29), బండారు గంగరాజు అలియాస్ టక్కరి రాజు (43) ను సోమవారం పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు. మరో నిందితుడు దస్తగిరి పరారీలో ఉండగా, అతడి కోసం గాలిస్తున్నారు.
జిలానీ పాషాపై రెండు హత్య కేసులతో పాటు నాలుగు ఇతర కేసులు ఉన్నాయని పోలీసుల విచారణలో తేలగా.. మహ్మద్ ఫిరోజ్ ఖాన్ అసిఫ్నగర్లో రౌడీషీటర్గా ఉన్నాడని గుర్తించారు. జిలానీ సోదరుడు ఫరూక్పై నర్సాపూర్లో హత్య కేసు, షేక్ యూనిస్పై మాదాపూర్ పీఎస్లో డెకాయిటీ కేసు ఉన్నట్లు తెలిసింది. కాగా, దుర్గం కమలాకర్పై మేడ్చల్లో డ్రగ్స్ కేసు ఉన్నట్లు విచారణలో తేలింది. వీరంతా నర్సాపూర్ అడవుల్లో మణికంఠ నిర్వహించే జువ్వా (పేకాట)కు సహకరిస్తుండటంతో పాటు రోజువారీగా డబ్బులు సంపాదిస్తుంటారని, గతంలో జువ్వా ఆడించే పుట్టా రాము, మణికంఠకు మధ్య విభేదాలు రావడంతో పాటు ఎల్ఎన్నగర్లో నివాసముంటున్న వ్యభిచార గృహ నిర్వాహకురాలు హిమాంబీ, ఆమె కుమార్తెతో పుట్టా రాముకు ఉన్న విభేదాల కారణంగా హత్య జరిగినట్టు పోలీసుల విచారణలో తేలింది.