జోన్ కార్గో డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ జి.జగన్
శేరిలింగంపల్లి, జూన్ 16: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ (టీఎస్ఆర్టీసీ) అధ్వర్యంలో ఇంటింటికీ కార్గో సేవలు అందుబాటులోకి వచ్చాయని, వీటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఈ సంస్థ గ్రేటర్ హైదరాబాద్ జోన్ కార్గో డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ జి.జగన్ అన్నారు. గచ్చిబౌలిలోని సెంట్రల్ యూనివర్సిటీ బస్ డిపోలో ఆర్టీసీ కార్గో సేవల పనితీరును గురువారం ఆయన స్వయంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ నగరంలో 25 ఆర్టీసీ కార్గో సెంటర్ల నుంచి ఈ సేవలను పొందవచ్చన్నారు. ఈ సేవలు హెచ్సీయూ, కోఠి, ఆటోనగర్, హయత్నగర్, కాచిగూడ, సీబీఎస్, ముషీరాబాద్, ఉప్పల్ క్రాస్ రోడ్, పటాన్ చెరువు, కూకట్పల్లి, చర్లపల్లి, కుషాయిగూడ, మేడ్చల్, జీబీఎస్, జీడిమెట్ల, జగద్గిరిగుట్ట, జేఎన్టీయూ, కేపీహెచ్బీ బస్టాప్ కౌంటర్లు ప్రజలకు అందుబాటులో ఉన్నాయని, కార్గో సేవలు విస్తృతం చేయడం జరిగిందని అన్నారు. లింగంపల్లి, గచ్చిబౌలి పరిసర ప్రాంతాల ప్రజలు హెచ్సీయు డిపోలో అందుబాటులో ఉన్న సెంటర్ సేవలు వినియోగించుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు టీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్ 040-2345033, 69440000లలో సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో హెచ్సీయూ డిపో మేనేజర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.