హైదరాబాద్ : ప్రజా సేవయే లక్ష్యంగా తాను ముందుకు సాగుతానని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి (MLA Bandari Lakshmareddy) అన్నారు. మంగళవారం కాప్రాసర్కిల్ కార్యాలయంలో ఇంజినీరింగ్ (Engineering), టౌన్ప్లానింగ్, రెవెన్యూ, శానిటేషన్, ఎలక్ట్రిసిటీ, యూసీడీ, ఎంటమాలజీ, తదితర విభాగాల అధికారులతో ఎమ్మెల్యే సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వస్థలాలు కబ్జా చేసేవారిని ఎంతమాత్రము ఉపేక్షించవద్దనీ, కాప్రా చెరువు(Kapra Tank) చుట్టూ భారీ స్థలాల్లో జరుగుతున్న అక్రమనిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కాప్రాసర్కిల్లో ప్రజల సహకారంతో సంపూర్ణ అభివృద్ధిని సాధిస్తామని అన్నారు. ప్రభుత్వ స్థలాలను కబ్జా చేయడమే లక్ష్యంగా కొంతమంది పనిచేస్తున్నారని, వారిపై అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
పెద్ద హోటళ్ల వద్ద ఎలాంటి పార్కింగ్ లేకుండానే కొనసాగడం వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు కలుగుతున్నాయని వాటిని అధికారులు గుర్తించాలని పేర్కొన్నారు. పార్కింగ్ ఉంటేనే అనుమతులు ఇవ్వాలని ఆదేశించారు. ఇంజినీరింగ్ విభాగం అధికారులు పనుల్లో వేగం పెంచాలని వెల్లడించారు. రానున్న వేసవిలో నీటి ఎద్దడి రాకుండా జలమండలి అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి, మీర్పేట్ హెచ్బికాలనీ కార్పొరేటర్ జే.ప్రభుదాస్, మల్లాపూర్ కార్పొరేటర్ పి.దేవేందర్రెడ్డి, నాచారం కార్పొరేటర్ శాంతి సాయిజెన్శేఖర్ అధికారులు పాల్గొన్నారు.