మేడ్చల్, నవంబరు 13: కన్ను తెరిస్తే జననం…కన్ను మూస్తే మరణం. కులం, మతం ఏదైనా జననంతో పాటు మరణానికి అంతే ప్రాధాన్యత ఉంది. బాధతో నిర్వహించే ఈ పవిత్ర కార్యక్రమానికి ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో ఇబ్బందులు ఉండేవి. శ్మశానవాటికకు వెళ్లేందుకు సరియైన దారి ఉండేది కాదు, లోపలికి వెళ్తే సరైన వసతులు ఉండేవి కావు. స్వరాష్ట్రంలో పరిస్థితి మారింది. శ్మశాన వాటికలు అభివృద్ధి చెందాయి. సకల సౌకర్యాలతో వైకుంఠధామాలు మారాయి.
ఊరూరా వైకుంఠధామాలు
మేడ్చల్ నియోజకవర్గంలో మేడ్చల్, శామీర్పేట, మూడుచింతపల్లి, ఘట్కేసర్, కీసర మండలాల్లో 61 పంచాయతీలు ఉండగా, మేడ్చల్, గుండ్లపోచంపల్లి, తూంకుంట, నాగారం, దమ్మాయిగూడ, ఘట్కేసర్, పోచారం మున్సిపాలిటీలు, జవహర్నగర్, పిర్జాదీగూడ, బోడుప్పల్ మున్సిపాలిటీలు ఉన్నాయి. దాదాపు అన్ని పంచాయతీలు, మున్సిపాలిటీల్లో శ్మశాన వాటికలకు ఇబ్బంది ఉండేది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వైకుంఠధామాలను స్థానిక సంస్థలు అభివృద్ధి చేశాయి.
గ్రామంలోని ప్రజలంతా ఒకేచోట కర్మకాండ నిర్వహించుకోవడంతో భూమి కొరత కూడా తీరింది. అభివృద్ధి చేసిన వైకుంఠధామాల్లో నీరు, స్నానాల గదులు, ఆధునిక బర్నింగ్ ప్లాట్ఫాంలు, విద్యుత్ సౌకర్యం, దింపుడు కళ్లాల నిర్మాణం జరిగింది. శ్మశాన వాటికకు వెలుపల, లోపల సీసీ రోడ్డు సౌకర్యం కల్పించారు. పిచ్చి మొక్కలను తొలగించి, హరితహారంలో భాగంగా పచ్చదనం పెంచారు. పీర్జాదిగూడ కార్పొరేషన్లో దాదాపు రూ.3 కోట్లతో వైకుంఠ ధామాన్ని అభివృద్ధి చేశారు. అలాగే అన్ని మున్సిపాలిటీలు, గ్రామాల్లో రూ.లక్షల నుంచి రూ. కోట్ల వరకు వ్యయం చేసి ఆధునిక సౌకర్యాలు కల్పించారు. దీంతో ఉమ్మడి రాష్ట్రంలో పడిన బాధలు తీరిపోయాయి.
ఇబ్బందులు తప్పాయి…
తెలంగాణ రాక ముం దు చాలా ఇబ్బందులు ఉండేవి. నీళ్లు లేక వ్యవసాయల బోరు బావులు, కుంటల వద్దకు వెళ్లాల్సి వచ్చేది. రోడ్డు సరిగా లేక శవం ఎత్తుకెళ్లడానికి ఇబ్బంది ఉండేది. బాత్రూంలు, షెడ్లు లేకపోయేవి. చావు బాధతో పాటు ఈ ఇబ్బందులు కూడా ఉండేవి. వర్షాకాలం వచ్చిదంటే మరింత ఇబ్బందిగా ఉండేది. తెలంగాణ వచ్చినంక ఆ ఇబ్బందులన్ని తీరాయి. శ్మశాన వాటికల్లో ఇబ్బందులను తొలగించిన మున్సిపాలిటీ పాలకవర్గానికి ప్రత్యేక కృతజ్ఞతలు.
-ఉన్నిగొర్ల గోపాల్ యాదవ్, గుండ్లపోచంపల్లి