వ్యవసాయ యూనివర్సిటి : వేసవి ప్రస్తుత పరిస్థితుల్లో పొలాలను చదును చేసి .. సేంద్రియ ఎరువులు చల్లి.. చినుకు పడగానే దుక్కులు దున్ని సాగుకు సిద్ధం చేసుకోవాలని ప్రొ.జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం డైరెక్టర్ ఆఫ్ రీసర్చ్ డా. ఆర్.జగదీశ్వర్ సూచించారు. ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ యన మాట్లాడుతూ.. చెరువుల్లో ఒండ్రు పొ లాలకు ఎంతో మేలు చేస్తుందన్నారు. పశువుల పేడ పొలాల్లో వీలైనంత ఎక్కువగా వాడాలన్నారు. రాష్ట్రంలో ఇప్పటికీ ప్రతి ఏటా 50 శాతం సాగుభూమి వర్షాధారంగా సాగవుతోంది. మెట్ట వ్యవసాయంలో వాతావరణ అవరోధాలు, భూసారం, కలుపు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు , సంప్రదాయ పద్ధతిలో సాగు వంటి అవరోధాలు పంట దిగుబడిని దెబ్బతీస్తున్నాయి. ప్రస్తుతం అక్కడక్కడ కురిసిన వర్షాలకు వెంటనే దుక్కులు సిద్ధం చేస్తే జూన్ తొలకరి (వర్షాకాలం)లో విత్తనాలు వేయవచ్చన్నారు.