శామీర్పేట, ఏప్రిల్ 10 : ఎలిజబెత్-2 రాణి , ఆమె భర్త ప్రిన్స్ ఫిలిప్ సేవలను దేవరయాంజాల్ గ్రామస్తులు గుర్తుచేసుకున్నారు. అనారోగ్యంతో మృతి చెందిన ప్రిన్స్ ఫిలిప్కు నివాళులర్పించారు. 1983లో దేవరయాంజాల్ గ్రామాన్ని సందర్శించిన ఎలిజబెత్ రాణి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని కొనియాడారు. 1980 దశకంలో రాణి గ్రామాన్ని సందర్శించి, పేదలకు ఉపాధి కోసం పలు పనులను ప్రారంభించారు. గ్రామస్తులు ఆ అభివృద్ధి పనుల గురించి చర్చించుకుంటూ ఎలిజబెత్ దాతృత్వాన్ని కొనియాడుతున్నారు. ఎలిజబెత్ గ్రామంలో 5 గంటల పాటు ఉన్నారు. ఈ విషయాన్ని అప్పటి సర్పంచ్ పీసరి శ్రీనివాస్రెడ్డి పాతజ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. 1983 నవంబర్లో ఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ సమావేశాల్లో పాల్గొనేందుకు ఎలిజబెత్ రాణి దంపతులు దేశానికి వచ్చారు. అదే సమయంలో నవంబర్ 20న తన పెళ్లిరోజు కావడంతో వివాహ వేడుకలను జరుపుకునేందుకు బొల్లారంలోని చర్చికి వచ్చారు.
ఈ సందర్భంగా ఎలిజబెత్ రాణిని కలిసిన అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుతో ముచ్చటిస్తూ తమ దేశం బ్రిటన్ నుంచి రాష్ట్రంలోని బలహీనవర్గాల కాలనీల అభివృద్ధి పెద్ద మొత్తంలో నిధులు ఇచ్చామని, తమకు ఏదైనా ఒక బలహీనవర్గాల కాలనీ, సంప్రదాయబద్ధమైన ఆలయానికి తీసుకెళ్లాలని కోరారు. దీంతో సీఎం అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ జానకీకృష్ణమూర్తితో చర్చించి, దేవరయాంజాల్ గ్రామాన్ని ఎంపిక చేశారు. గ్రామానికి నవంబర్ 20న ఉదయం 9 గంటల వచ్చిన ఎలిజబెత్ మధ్యాహ్నం 2 గంటల వరకు ఉన్నారు. సర్పంచ్, గ్రామస్తులతో ఆప్యాయంగా మాట్లాడారు. శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానాన్ని దర్శించుకున్నారు. అనంతరం బలహీన వర్గాల ఉపాధి కోసం రూ.10 లక్షలతో కమ్యూనిటీ హాల్, షాపింగ్ కాంప్లెక్స్, దేవరయాంజాల్ నుంచి తూకుంట వరకు 3 కిలో మీటర్ల రోడ్డు పనులు ప్రారంభించారు. ఆ నిర్మాణాలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి.