సిటీబ్యూరో, జూన్ 2 (నమస్తే తెలంగాణ) : జుట్టుకు వేసుకునే హెయిర్డైతో కల్తీ ఆవాలు తయారు చేస్తూ మార్కెట్లో విక్రయిస్తున్న నేరగాడిని సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. టాస్క్ఫోర్స్ డీసీపీ రాధాకిషన్రావు కథనం ప్రకారం.. బేగంబజార్లో నివాసముండే భగవాన్లాన్ పాండే, జియాగూడలో ఓ గోడౌన్ నిర్వహిస్తున్నాడు. తినేందుకు వీలు లేని నాసిరకమైన ఆవాలు గుజరాత్, రాజస్తాన్ నుంచి తెప్పిస్తాడు. అవాలు నల్లగా ఉంటే క్వాలిటీగా కన్పిస్తాయని, అందుకు ఆవాల గింజలకు వెంట్రుకలకు వేసుకునే బ్లాక్ కలర్ను వేస్తాడు. భవానీ కెమికల్స్ నుంచి ఎంఓఆర్ బ్రాండ్ పేరుతో ఉండే ఈ కెమికల్స్ను ఉపయోగిస్తున్నాడు. గోడౌన్లో నాసిరకమైన ఆవాలకు నల్ల కలర్ వేసి, నాణ్యమైన ఆవాలుగా మార్కెట్లో బేగంబజార్లోని దుకాణాలకు విక్రయిస్తుంటాడు. బేగంబజార్లోని జగదీశ్ బాటీ, కన్నయ్యలాల్ బాటీ, రూప్చంద్ బాటి, రూపేశ్ అనే హోల్సేల్ డీలరకు ఈ కల్తీ ఆవాలు సరఫరా చేస్తున్నాడు. వారి నుంచి అవి చిన్న చిన్న దుకాణాలకు, వినియోగదారులకు నేరుగా వెళ్తున్నాయి. కెమికల్స్తో కూడిన ఈ ఆవాలు వాడడం వల్ల ప్రజల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం ఉంటుంది. విశ్వసనీయ సమాచారంతో సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్ ఇన్ స్పెక్టర్ రఘునాథ్ బృందం ఈ గోడౌన్పై దాడి చేసి నిర్వాహకుడు భగవాన్లాల్ను అరెస్ట్ చేసి, అతడి వద్ద నుంచి 50 కిలోల బరువున్న 30 బ్యాగ్లలో ఉన్న కల్తీ ఆవాలు, తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు తదుపరి విచారణకు షాయినాయథ్గంజ్ పోలీసులకు అప్పగించారు.