సిటీబ్యూరో, మార్చి 17 : జిల్లాలో అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు 2021-22 సంవత్సరానికి సంబంధించి ప్రీ మెట్రిక్, పోస్టు మెట్రిక్ స్కాలర్షిప్ల కోసం ఈ నెల 31 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని హైదరాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వరరావు తెలిపారు. గురువారం కలెక్టరేట్ మీటింగ్ హాల్లో సంక్షేమ శాఖలకు చెందిన అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటి వరకు 16 వేల పోస్టు మెట్రిక్ దరఖాస్తులు అందాయని, ప్రీ మెట్రిక్ కోసం 10 వేల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని చెప్పారు. పెండింగ్లో ఉన్న కుల, ఆదాయం ధ్రువీకరణ పత్రాల దరఖాస్తులను తాసీల్దార్లు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. వారం రోజుల్లో దరఖాస్తుల ప్రక్రియ పూర్తి చేయాలని డిప్యూటీ ఈవోలు, ఎంఈవోలకు సూచించారు. ఈ కార్యక్రమంలో సోషల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ రామారావు, డీఈవో రోహిణి, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ ఆశన్న, గిరిజన సంక్షేమ శాఖ అధికారి రామేశ్వరి, లీడ్ బ్యాంక్ మేనేజర్, డిప్యూటీ డీఈవోలు, ఏఎస్వోలు తదితరులు పాల్గొన్నారు.